
2024 నవంబరులో డీఆర్డీవో తొలి హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను నిర్వహించడం ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. దేశీయ స్ర్కామ్జెట్ ఇంజిన్ అభివృద్ధిలో ఇదో ఘన విజయంగా నిలిచింది. దీంతో స్ర్కామ్జెట్ హైపర్సోనిక్ వ్యవస్థలను అభివృద్ధి చేసిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలిచింది. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ సామర్థ్యం ఉన్న శక్తిమంతమైన దేశాల్లో మనదేశం ఒకటిగా నిలిచింది.
మాక్ 5 (ధ్వని కన్నా ఐదు రెట్లు వేగం) కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఆయుధాలను హైపర్సోనిక్గా పేర్కొంటారు. ప్రస్తుతానికి ఇలాంటి హైస్పీడ్ క్రూయిజ్ మిసైళ్లను అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఏదీ ప్రపంచంలో లేదు. అలాంటి అత్యాధునిక 12 హైపర్సోనిక్ ఆయుధాలను ఆర్మీ, నేవీ, వాయుసేన కోసం డీఆర్డీవో అభివృద్ధి చేస్తోంది.
దీనిలో మొట్టమొదటగా ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్(ఈటీ-ఎల్డీహెచ్సీఎం)ను ప్రాజెక్టు విష్ణులో భాగంగా రూపొందిస్తున్నారు. స్ర్కామ్జెట్ ఇంజిన్తో మాక్ 8 స్పీడ్ను అందుకునేలా దీనికి రూపకల్పన చేశారు. 2,500 కిలోమీటర్ల వరకు ఉన్న పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదని చెబుతున్నారు.
2030 కల్లా దీనిని సాయుధ బలగాల అమ్ములపొదిలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక మరో ప్రధానమైన ఆయుధం హెచ్జీవీ. స్ర్కామ్జెట్ ఇంజిన్తో రూపొందించిన ఈ మిసైల్ను నవంబరు 2024లో డీఆర్డీవో పరీక్షించింది.యుద్ధనౌకలపై దాడి చేసేందుకు రూపొందించిన ఈ మిసైల్ రేంజ్ 1,500 కిలోమీటర్లు. 2030 కల్లా దీనిని కూడా ప్రవేశపెట్టనున్నారు.
ఇదే సమయంలో ప్రాజెక్టు కుశ కింద ప్రత్యేక హైపర్సోనిక్ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత్ కృషి చేస్తోంది. దాడి చేసే ఆయుధాలను రూపొందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. ఇక ఇండో-రష్యన్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్కు హైపర్సోనిక్ వెర్షన్ బ్రహ్మోస్-2 అభివృద్ధిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
భూమిపై నుంచి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపైకి మాక్ 7 నుంచి 8 వేగంతో దూసుకుపోయేలా దీన్ని డిజైన్ చేశారు.యుద్ధ విమానాలు, నౌకల నుంచి కూడా ప్రయోగించే హైపర్సోనిక్ మిసైళ్లను డీఆర్డీవో అభివృద్ధి చేస్తోంది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే వర్షన్ కూడా ప్రతిపాదనలో ఉంది. అంతేకాకుండా హైపర్సోనిక్ డ్రోన్లు, డెకాయ్లు కూడా రూపొందిస్తోంది. 2030 కల్లా సమగ్ర హైపర్సోనిక్ మిసైల్ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు