డీఆర్‌డీవో ఆధ్వర్యంలో 12 హైపర్‌సోనిక్‌ మిసైళ్లు సిద్ధం

డీఆర్‌డీవో ఆధ్వర్యంలో 12 హైపర్‌సోనిక్‌ మిసైళ్లు సిద్ధం
 
అత్యాధునిక ఆయుధాలతో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి భారత్‌ సిద్ధమవుతోంది. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో వివిధ రకాల 12 హైపర్‌సోనిక్‌ మిసైళ్లు సిద్ధం అవుతున్నాయి. దాడి చేయడం, రక్షణ సామర్థ్యాలపై దృష్టి పెట్టడం లక్ష్యంగా ఈ హైపర్‌సోనిక్‌ మిసైల్‌ టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్టు విష్ణులో ఈ మిసైళ్ల తయారీని ప్రధానంగా చేపట్టారు.
 
 వీటితో పాటు మరిన్ని అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో ఓ హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ వెహికిల్‌ (హెచ్‌జీవీ), హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిసైల్స్‌, హైపర్‌సోనిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడంలో ప్రధాన లక్ష్యం.. అత్యంత వేగవంతమైన దాడి సామర్థ్యాలలో స్వావలంభన సాధించడం, అలాగే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడే శత్రువులను ఎదుర్కోవడానికి బలమైన రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం అని నిపుణులు చెబుతున్నారు.
2024 నవంబరులో డీఆర్‌డీవో తొలి హైపర్‌సోనిక్‌ మిసైల్‌ పరీక్షను నిర్వహించడం ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. దేశీయ స్ర్కామ్‌జెట్‌ ఇంజిన్‌ అభివృద్ధిలో ఇదో ఘన విజయంగా నిలిచింది. దీంతో స్ర్కామ్‌జెట్‌ హైపర్‌సోనిక్‌ వ్యవస్థలను అభివృద్ధి చేసిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్‌ నిలిచింది. దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ మిసైల్‌ సామర్థ్యం ఉన్న శక్తిమంతమైన దేశాల్లో మనదేశం ఒకటిగా నిలిచింది. 

మాక్‌ 5 (ధ్వని కన్నా ఐదు రెట్లు వేగం) కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఆయుధాలను హైపర్‌సోనిక్‌గా పేర్కొంటారు. ప్రస్తుతానికి ఇలాంటి హైస్పీడ్‌ క్రూయిజ్‌ మిసైళ్లను అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఏదీ ప్రపంచంలో లేదు. అలాంటి అత్యాధునిక 12 హైపర్‌సోనిక్‌ ఆయుధాలను ఆర్మీ, నేవీ, వాయుసేన కోసం డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తోంది. 

దీనిలో మొట్టమొదటగా ఎక్స్‌టెండెడ్‌ ట్రాజెక్టరీ లాంగ్‌ రేంజ్‌ హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ మిసైల్‌(ఈటీ-ఎల్‌డీహెచ్‌సీఎం)ను ప్రాజెక్టు విష్ణులో భాగంగా రూపొందిస్తున్నారు. స్ర్కామ్‌జెట్‌ ఇంజిన్‌తో మాక్‌ 8 స్పీడ్‌ను అందుకునేలా దీనికి రూపకల్పన చేశారు. 2,500 కిలోమీటర్ల వరకు ఉన్న పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదని చెబుతున్నారు. 

2030 కల్లా దీనిని సాయుధ బలగాల అమ్ములపొదిలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక మరో ప్రధానమైన ఆయుధం హెచ్‌జీవీ. స్ర్కామ్‌జెట్‌ ఇంజిన్‌తో రూపొందించిన ఈ మిసైల్‌ను నవంబరు 2024లో డీఆర్‌డీవో పరీక్షించింది.యుద్ధనౌకలపై దాడి చేసేందుకు రూపొందించిన ఈ మిసైల్‌ రేంజ్‌ 1,500 కిలోమీటర్లు. 2030 కల్లా దీనిని కూడా ప్రవేశపెట్టనున్నారు. 

ఇదే సమయంలో ప్రాజెక్టు కుశ కింద ప్రత్యేక హైపర్‌సోనిక్‌ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత్‌ కృషి చేస్తోంది. దాడి చేసే ఆయుధాలను రూపొందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. ఇక ఇండో-రష్యన్‌ బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ మిసైల్‌కు హైపర్‌సోనిక్‌ వెర్షన్‌ బ్రహ్మోస్‌-2 అభివృద్ధిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 

భూమిపై నుంచి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపైకి మాక్‌ 7 నుంచి 8 వేగంతో దూసుకుపోయేలా దీన్ని డిజైన్‌ చేశారు.యుద్ధ విమానాలు, నౌకల నుంచి కూడా ప్రయోగించే హైపర్‌సోనిక్‌ మిసైళ్లను డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తోంది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే వర్షన్‌ కూడా ప్రతిపాదనలో ఉంది. అంతేకాకుండా హైపర్‌సోనిక్‌ డ్రోన్లు, డెకాయ్‌లు కూడా రూపొందిస్తోంది. 2030 కల్లా సమగ్ర హైపర్‌సోనిక్‌ మిసైల్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది.