కేపిటలిజం, కమ్యూనిజానికి ప్రత్యామ్నాయం `ఏకాత్మతా మానవతావాదం’

కేపిటలిజం, కమ్యూనిజానికి ప్రత్యామ్నాయం `ఏకాత్మతా మానవతావాదం’

ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
ఉపాధ్యక్షుడు, ఏపీ బీజేపీ 
 

“భారతీయతను నిర్లక్ష్యం చేస్తే స్వాతంత్ర్యానికి అర్థం ఉండదు.  ప్రజల సమగ్ర పురోగతిని సాధించాలనే ఉద్దేశ్యంతో శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ అవసరాలను తీర్చడం అనే నాలుగు విధాలైన బాధ్యతల ఆదర్శం మన లక్ష్యం”                  – పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ

ప్రపంచంలో మనుషులందరూ సమానమే. అందరూ ఇదే చెబుతారు. కానీ ఆచరణకు వచ్చే సరికి ప్రజల మధ్య విభజన పెడతారు. కేపిటలిజం, కమ్యూనిజం లాంటి వాదనలతో పరస్పర దోపిడీని ప్రోత్సహిస్తారు. కానీ విశ్వమానవ స్ఫూర్తితో ప్రజలంతా ఒక్కటే అన్న భావనతో ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉన్న ఒకే ఒక్క వాదం “ ఏకాత్మతా మానవతావాదం”.  పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఈ “ ఏకాత్మతా మానవతావాదం” ఇప్పుడు  మన దేశ రాతను మారుస్తోంది.  ఈ రోజున భారత దేశాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేస్తోంది.  భారత ప్రజల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గేలా చేస్తోంది. ప్రజలంతా సమానమే అన్న భావన పెరిగేలా చేస్తోంది.

`పెట్టుబడి పెట్టు …ప్రజల్ని బానిసలుగా చేసుకుని డబ్బు సంపాదించు’ అనేది క్యాపిటలిజం.  `ఉన్నవాడిని కొట్టు .. లేని వాడికి పెట్టు’ అనేది కమ్యూనిజం.  ఈ రెండు వాదాల్లోనూ సగం మంది మనుషుల్ని మరో సగం మంది మనుషులు దోచుకోవాలన్న సందేశం ఇమిడి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓకే నాణేనికి రెండు కోణాలు ఈ రెండు సిద్ధాంతాలు.  కానీ  “ప్రతి మనిషి జీవితంలో  అభివృద్ధి చెంది,  ఆధ్యాత్మికతో మానవసేవ చేయడం” అనే భావనతో వచ్చినదే ఏకాత్మతా మానవతావాదం.

క్యాపిటలిజం, కమ్యూనిజం వైఫల్యాల వల్ల ప్రపంచంలో విభజన వచ్చింది. ధనిక, పేద అంతరాలు పెరిగిపోయాయి.  ఒకరి అభివృద్ధికి, మరొకరు సహకరించుకుని సమాజంలో సమానత తేవాల్సిన లక్ష్యం లేకుండా  ఒకరినొకరు దోచుకోవడం అన్న  వాదంతో విభజన తెచ్చాయి. కానీ అందరూ అభివృద్ధి..అందరూ ఆధ్యాత్మిక దృష్టితో మానవసేవ చేయాలి అన్న ఆలోచనతో పుట్టిందే “ ఏకాత్మతా మానవతావాదం”.

“ ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ.  పదవులేమీ అధిరోహించకుండానే  రాజకీయాల్లో దిగ్గజంగా ఎదిగిన నేత. ఆయన భావజాలం, ప్రతిపాదించిన సిద్ధాంతమే ఆయనను ఉన్నత స్థానంలో నిలబెట్టింది.  పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ తత్వవేత్త, రచయిత, పాత్రికేయుడు,  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)  కార్యకర్త. భారతీయ జనసంఘ్ (బిజెఎస్), ఇప్పటి భారతీయ జనతా పార్టీ వారి ఆలోచన భావజాలంతో ప్రారభమైన సంస్థ.

భారతీయ జనసంఘ్ అనే ఆలోచన నాటి అనేకమంది జాతీయ వాద నాయకుల్లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యయ గారిది కీలకమైన పాత్ర. నెహ్రూ విధానాలను వ్యతిరేకించి,  ఓ వర్గాన్ని మాత్రమే సంతృప్తి పరిచే నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో అందరికీ సమానత్వం, అభివృద్ది లభించాలన్న లక్ష్యంతో రాజకీయంగా ముందడుగు వేశారు. భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతం లేదు  అని విమర్శించేవారికి సమాధానం ఇచ్చేందుకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1965లో జనసంఘ్  అధికారిక సిద్ధాంతంగా “ఏకాత్మతా మానవతావాదం”ను రూపొందించారు. 
 
ఇది కమ్యూనిజం , పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా భారతీయ సంస్కృతి,  జాతీయత విలువల ఆధారంగా ఒక సమగ్ర ఆర్థిక, రాజకీయ నమూనాను  ప్రతిపాదించింది.  ఆయన ఓక సందర్భంలో రాజకీయ పార్టీ అంటే కోందరు గుంపుగా చేరి, అధికారం సంపాదించడం, దోచుకోవడం కాదు, కారాదు  రాజకీయ పార్టీ అంటే ప్రజల మధ్య, వారి భాగస్వామ్యంతో, వారి భావాలు సమ్మేళితంగా ఉండాలి, అప్పుడే ఆ పార్టీ మనుగడ సాధించగలుగుతుంది అని తెలిపారు.
 
ఆ విషయం చెప్పడమే కాదు, ఆచరణలో చేసి చూపించారు. ఈ సిద్దాంతంలో  అంత్యోదయ, సర్వోదయ, స్వదేశీ, ధర్మరాజ్యం, భారతీయత  ఉంటాయి.   సమాజంలో అత్యంత వెనుకబడిన వ్యక్తుల ఉద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వడం అంత్యోదయ.  అందరి శ్రేయస్సు, ఆర్థిక- సామాజిక సమానత్వం కల్పించడం సర్వోదయ.  స్థానిక ఉత్పత్తులు, స్వావలంబనను ప్రోత్సహించడం స్వదేశీ.  నీతి ,  ధర్మంపై ఆధారపడిన పాలన చేయడం ధర్మరాజ్యం,  భారతీయ సంస్కృతి, విలువల ఆధారంగా ఆర్థిక  రాజకీయ వ్యవస్థను నిర్మించఀడం భారతీయత.  
 
ఈ సిద్ధాంతం వారి ప్రతిపాదనలను దేశంలో విస్తృతంగా చర్చకు పెట్టారు, అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సిద్ధాంతం 1965 జనవరి 23 నుంచి 26 తేదీల మధ్య విజయవాడలో జరిగిన కీలకమైన సమావేశంలో ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన జనసంఘ్ జాతీయ సమావేశాలలో “ఏకాత్మతా మానవతావాదం”ను మార్గదర్శక సిద్ధాంతంగా స్వీకరించారు.  
 
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించిన `ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతం అధికారిక ఆమోదం 1965 ఏప్రిల్ 22–25 ముంబైలో జరిగింది. ఈ సమావేశంలో అధికారిక ఈ సిద్ధాంతాన్ని జనసంఘ్ స్వీకరించింది. అప్పటి నుంచి “ఏకాత్మ మానవతావాదం” సిద్దాంతంతో  జనసంఘ్‌ను  బలోపేతం చేశారు. 1967 ఎన్నికలలో జనసంఘ్ 35 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది.  జనసంఘ్, ఇతర విపక్ష పార్టీలతో కలిసి సంయుక్త విధాయక్ దళ్ కూటమి ద్వారా ఉత్తర ప్రదేశ్ వంటి  రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆనాడే సంకీర్ణ రాజకీయాలకు ఆద్యంపొంసింది.
 
ఆ తర్వాత జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిందని అనుకోవచ్చు. బీజేపీ కూడా  పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ “ఏకాత్మ మానవతావాదం” సిద్దాంత పునాదుల మీదనే బలంగా నిలబడింది. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. కమ్యూనిజం,  కేపిటలిజం వల్ల వస్తున్న ఎన్నో దుష్పరిణామాలను అణిచివేస్తూ “ఏకాత్మతా  మానవతావాదం” సిద్దాంతంతో  దేశాన్ని వెలుగుల వైపు నడిపిస్తున్నారు. 

భారతీయ సంస్కృతి, గాంధీ సిద్ధాంతాలైన సర్వోదయ, స్వదేశీ,  హిందుత్వ భావజాలాన్ని సమన్వయం చేసుకుని  సామాజిక సమానత్వాన్ని సమర్థించారు. రాజకీయాలను ప్రజా సేవగా భావించారు.   ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆయన ఆలోచనలను “మేక్ ఇన్ ఇండియా”, “వోకల్ ఫర్ లోకల్” వంటి కార్యక్రమాలలో ప్రతిబింబిస్తోంది.

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లారు. 8 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు మరణించారు.  తమ్ముడు శివదయాళ్ కూడా చిన్న వయసులోనే చనిపోయారు. సీకర్‌లోని హైస్కూల్‌లో చదివారు. అక్కడ మహారాజా ఆఫ్ సీకర్ నుండి బంగారు పతకం, స్కాలర్‌షిప్ పొందారు.  ప్రస్తుతం బిర్లా స్కూల్ గా మారిన  పిలానీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.  కాన్పూర్‌లోని సనాతన ధర్మ కాలేజీలో బీఏ పట్టా పొందారు .

1937లో కాన్పూర్‌లో చదువుతున్నప్పుడు సహపాఠి బాలుజీ మహాశబ్దే ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  లో చేరారు. 1940లలో లక్నో నుండి “రాష్ట్ర ధర్మ” అనే మాసపత్రికను ప్రారంభించారు.  ఇది హిందుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగపడింది. “పాంచజన్య” వారపత్రిక,  “స్వదేశ్”  దినపత్రికల్ని ప్రారభించారు.  1942లో  పూర్తి సమయం ప్రచారక్‌గా మారారు. 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి  భారతీయ జనసంఘ్‌ స్థాపించారు. 1967 డిసెంబర్ 29న జనసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

విశ్వ మానవ స్ఫూర్తితో  “ఏకాత్మ మానవతావాదం” సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు.  ఈ రోజు దేశంలో అసమానతలు తగ్గుతున్నాయి. పేదరికం తగ్గుతోంది. ప్రజలందరూ అభివృద్ధి చెందాలి.. వారికి ఆధ్యాత్మికంగా స్పష్టమైన అభిప్రాయాలు ఉండాలి. అప్పుడే క్రమబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. విలువలతో కూడిన జీవనం  అందుబాటులోకి వస్తుంది. ప్రజలందరూ విలువలతో కూడిన అభివృద్ధిని చూస్తే దేశం ఎంతో ముందడుగు వేస్తుంది.

ఈ సిద్దాంతాల అమలుతో భారత్ ఎంతో అభివృద్ధి జరుగుతోందనడానికి గణాంకాలే సాక్ష్యం.  గత దశాబ్దంలో మొత్తం పేదరికం భారీగా తగ్గింది.  ప్రపంచ బ్యాంక్  2011-12లో 16.2% నుండి 2022-23లో 2.3% కు, అంటే 13.9 శాతం పాయింట్ల మేర భారత్ లో పేదరికం తగ్గిందని ప్రకటించింది. దీనిద్వారా 17.1 కోట్ల మంది నిరుపేద బతుకుల నుంచి బయటపడ్డారు. 

నీతి ఆయోగ్ ప్రకారం   2013-14లో 29.17% నుండి 2022-23లో 11.28% కు, అంటే 17.89 శాతం పాయింట్ల తగ్గుదల. 9 సంవత్సరాలలో 24.82 కోట్ల మంది మల్టీ డైమెన్షనల్ పేదరికం నుండి బయటపడ్డారు. అంటే వీరందరికీ ఉపాధి కలుగుతోంది. ఇదంతా  పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ “ ఏకాత్మతా మానవతావాదం”  సిద్ధాంతాల సమర్థ అమలుతోనే సాధ్యమయిందని భావింవచ్చు.

దేశంలో ఉన్న అనేక సమస్యలకు కారణం కేపిటలిజం, కమ్యూనిజమే. ఈ రెండు సిద్ధాంతాలు.. అందరూ అభివృద్ధి చెందాలి, విలువలతో బతికాలి అని చెప్పలేదు. కానీ “ ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతం మాత్రం విశ్వమానవడి కోసం ప్రతిపాదించింది. ఆర్థిక అసమానతలు తగ్గితే అందరూ సమానం అవుతారు. అప్పుడు కుల వివక్ష కూడా తగ్గిపోతుంది.

అయితే “ ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతంలో హిందూత్వం ఉందని, అది మతవాదన అని కొంత మంది అనుకుంటూ ఉంటారు. కానీ హిందూత్వం అనేది ఓ జీవన విధానం. ఆ విషయంలో స్పష్టత లేకపోవడం వల్లనే అపోహలు వస్తున్నాయి.  “ఏకాత్మతా మానవతావాదం” సిద్దాంతాలు సాధిస్తున్న విజయాలపై ఓ అవగాహన, సిద్దాంతాలపై స్పష్టత ఉంటే ఎవరూ హిందూత్వం అనేది మత భావన అనే ప్రస్తావనకు రారు. 

ఏ మతమైన అందరికీ మేలు చేయాలని చెప్పేదే  “ ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతం. ఈ సిద్దాంతంపై ప్రపంచంలోని అనేక దేశాలు పరిశోధనలు చేశాయి. తమ దేశ కాల, మాన పరిస్థితులకు అనుగుణంగా ఉన్న లక్ష్యాలను అమలు చేసుకునేందుకు ప్రయత్నించాయి. పూర్తిగా విశ్వమానవ శ్రేయస్సుకు ఉపయోగపడే సిద్ధాంతాలు కావడంతో అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా “ఏకాత్మతా మానవతావాదం”పై పరిశోధనలు చేశాయి. కొన్ని వందల మంది విద్యార్థులు ఈ అంశంపై పీహెచ్‌డీలు కూడా చేశారు. ప్రజలకు ఈ సిద్దాంతాలు ఎంత అవసరరమో వీరి పరిశోధనల్లో తేలింది.

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ” ఏకాత్మతా మానవతావాదం” భావజాలానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, 2025 మే 31 నుండి జూన్ 1 వరకు న్యూఢిల్లీలో రాష్ట్రీయ స్మృతి సమ్మేళన్ పేరుతో జాతీయ సమావేశం నిర్వహించారు. ఈ సదస్సును డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎస్ పి ఎం ఆర్ ఎఫ్) ఆధ్వర్యంలో, పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సెంటర్ (పి పి ఆర్ సి), ఏకాత్మ మానవదర్శన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ , ప్రభాత్ ప్రకాశన్ సహకారంతో నిర్వహించారు.

మేధావులు, పండితులు ,విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా దేశ మేధో, జాతీయ అభివృద్ధికి మార్గం సుగమం చేయడం దీని లక్ష్యం. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో తుగ్లక్ ఎడిటర్ గురుమూర్తి, శివప్రకాష్,  డా. మహేష్ చంద్ర శర్మ, జగత్ ప్రకాశ్ నడ్డా, ఆర్ ఎస్ ఎన్, జాతీయ నేత అరుణ్ కుమార్ , బి యస్ ,సంతోష్ వంటి వారితో పాటు  పాటు దేశంలోని పలు రంగాల్లో ఉన్న ప్రముఖులు  తమ ఆలోచనలను పంచుకున్నారు. 

“ఏకాత్మతా మానవతావాదం” సిద్ధాంతంపై స్పష్టమైన అవగాహన, విశ్వ మానన స్ఫూర్తికి ఈ సిద్ధాంతంపై సందేశం ఇస్తారు. ఏంతో ఘనమైన చరిత్రను స్వంతం చేసుకున్న మన దేశం నుండి  ఒక భారతీయుడి నూతన ఆలోచనలు విశ్వవ్యాప్తం కావడం భారతీయత గొప్పతనం. ఈ భారతీయత  నిజమైన అభివృద్ధికి దోహదం చేయడంతో ప్రతి ఒక్కరి ఆకాంక్షకు అనుగుణమైన విశ్వ మానవతా సిద్ధాంతాలలో ఒకటైన వసుదైవ కుటుంబం స్ఫూర్తిని పరోక్షంగా ఈ సిద్ధాంతం సూచిస్తుంది.