కోల్‌కతా కాలేజీ గదుల్లో రూ 1 కోటి నగదు, గన్‌, బెడ్స్‌, కండోమ్స్‌

కోల్‌కతా కాలేజీ గదుల్లో రూ 1 కోటి నగదు, గన్‌, బెడ్స్‌, కండోమ్స్‌
ఓ ప్రముఖ కాలేజీలో విద్యార్థి సంఘం గదిలో చెదలు పట్టిన లక్షలాది రూపాయల నగదును గుర్తించారు. అలాగే రహస్య గదుల్లో ఫర్నిచర్, రెండు ఏసీ బెడ్‌ రూమ్స్‌, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ కూడా లభించడం కలకలం రేపాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది.  
 
విద్యార్థి సంఘం నిధుల నుండి చేసే అన్ని ఖర్చులను ఆడిట్ చేయాలని సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కళాశాలలను కోరిన తర్వాత సురేంద్రనాథ్ కళాశాలలోని ఆ గదిని తెరిచారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఒకటైన సురేంద్రనాథ్ కళాశాలలో క్లీనింగ్‌ డ్రైవ్‌ చేపట్టారు. కాగా, 2019 నుంచి క్యాంపస్ ఎన్నికలు జరగనందున కళాశాలల్లోని యూనియన్ రూమ్‌లను మూసివేయాలని అప్పటి టీఎంసీ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో 2025 నుంచి లాక్‌ వేసి ఉన్న సురేంద్రనాథ్ కాలేజీలోని విద్యార్థి సంఘం గదిని ఏడాది తర్వాత తెరిచారు. అందులోని అల్మారాలో ఉన్న రెండు సూట్‌కేసుల్లో చెదలు పట్టి, పాడైన లక్షలాది రూపాయల నగదు కనిపించింది. మరోవైపు కొన్ని గంటల తర్వాత ఆ కాలేజీలో రహస్య గదులను గుర్తించారు.  పాక్షికంగా ఫర్నిచర్ ఉన్న రెండు ఏసీ బెడ్‌ రూమ్స్‌, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ లభించాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ కాలేజీకి చేరుకున్నారు.
ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే గత తృణమూల్ ప్రభుత్వం ‘టెర్రస్ సౌకర్యాలు’గా వీటిని ప్రారంభించినట్లు విమర్శలు వచ్చాయి.  టీంఎసీ నేత దేబాశిస్ బంద్యోపాధ్యాయ్, ఆయన కుమారుడు శిభావిస్‌ ఈ గదులను వినియోగించినట్లు కళాశాల అధికారులు ఆరోపించారు. ఈ గదుల్లో ఉద్యోగులతో ఆ ఇద్దరు నాయకులకు మసాజ్ చేయించుకున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తునకు బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది.

కాగా, ఈ ఆరోపణలను దేబాశిస్ బంద్యోపాధ్యాయ్ ఖండిస్తూ ఆ గదుల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. అయితే ప్రముఖ బెంగాల్‌ సాహిత్యవేత్తలు, స్వాతంత్ర్య సమరయోధులను అందించిన ఆ పురాతన కళాశాలలో ఇవి బయటపడటం రాజకీయ వివాదం, విమర్శలకు దారి తీసింది. మంగళవారం, కళాశాల అధికారులు శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించడంతో  రహస్యాలు బయటపడటం ప్రారంభించాయి.

విద్యార్థి సంఘం గదిలోని ఒక పాత చెక్క అల్మారాలో రెండు పెద్ద పెట్టెల నిండా నగదు దొరికింది. దాని లోపల రూ.100, రూ.500 నోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి. అయితే, ఆ నగదులో గణనీయమైన భాగాన్ని చెదలు పాడుచేశాయి, దీనిని బట్టి ఆ డబ్బును చాలా కాలం పాటు అల్మారాలోనే ఉంచినట్లు తెలుస్తోంది.  కళాశాల ప్రవేశాలలో జరిగిన అవకతవకలకు ఈ డబ్బుతో సంబంధం ఉండవచ్చని బీజేపీ ఆరోపించింది.

ఈ వివాదం చెలరేగి, సోషల్ మీడియాలో వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే కళాశాలకు చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే సజల్ ఘోష్ ఈ నగదు మూలంపై ఈడీ విచారణ జరపాలని కోరారు. కళాశాలలోని అడ్మిషన్ల రాకెట్‌కు ఈ నగదుతో సంబంధం ఉండవచ్చని ఘోష్ ఆరోపించారు. కళాశాలలో ప్రవేశాల కోసం తృణమూల్ ఛాత్ర పరిషత్ నాయకులు లక్షల రూపాయలు తీసుకునేవారని ఆయన ఆరోపించారు. ఇలాంటి అవినీతి ద్వారా వచ్చిన డబ్బు చివరికి కాళీఘాట్‌కు చేరిందని, ఇది మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసమని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణపై తృణమూల్ ఇంకా స్పందించలేదు. 

“విద్యార్థుల నుంచి సాధారణంగా విద్యార్థి సంఘం రుసుముగా రూ. 50-100 వసూలు చేస్తారు. కేవలం ఇలాంటి వసూళ్ల నుంచి సంఘ నిధి ఏడాదిలో రూ. 1.5 కోట్లు కూడా పోగుపడదు,” అని ఘోష్ విమర్శించారు. జూన్ 1న, రాష్ట్ర ప్రభుత్వ సహాయం పొందే అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ‘విద్యార్థి సంఘం రుసుము’ వసూలును తక్షణమే నిలిపివేయాలని బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. 

అయితే, ఈ పరిణామం మంచుకొండకు ఒక చిన్న ఆనవాలు మాత్రమే కావచ్చు. గత కొన్నేళ్లుగా, కళాశాలల్లోని సంఘ నాయకులు ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నుంచి రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు వసూలు చేసేవారు.