రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) అభివృద్ధి చేసిన అనేక అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా భారతదేశ రక్షణ సామర్థ్యాలు ఒక పెద్ద పరివర్తనకు లోనవుతున్నాయి. తదుపరి తరం క్షిపణి చోదక వ్యవస్థలు, కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించే ఆయుధాల నుండి, సైనిక లాజిస్టిక్స్ ప్లాట్ఫారమ్లు, గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్రకు మద్దతు ఇచ్చే సాంకేతిక పరిజ్ఞానాల వరకు, డిఆర్డిఓ బహుళ రంగాలలో భారతదేశ వ్యూహాత్మక బలాన్ని నిరంతరం పెంపొందిస్తుంది.
ఈ ఆవిష్కరణలు సాయుధ దళాల కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా, కీలకమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలలో స్వావలంబన సాధించాలనే భారతదేశ దార్శనికతను కూడా బలోపేతం చేస్తున్నాయి.
రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (ఆర్ టిఆర్ఎస్)
రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (ఆర్ టీఆర్ఎస్) ప్రస్తుతం కార్యాచరణలో ఉంది. దీనిని డిఆర్డిఓ అనేక రకాల రక్షణ పరీక్షల కోసం ఉపయోగిస్తుంది. ఆర్ టీఆర్ఎస్ అనేది ఒక హై-స్పీడ్ టెస్టింగ్ సిస్టమ్. ఇది ప్రత్యేకంగా రూపొందించిన రైలు పట్టాలపై అత్యంత అధిక వేగాన్ని సాధించడానికి రాకెట్ చోదక శక్తిని ఉపయోగిస్తుంది. ఇది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు గంటకు 1,000 కిలోమీటర్లకు మించిన వేగంతో తాకిడి, కంపనం, భద్రతా పరీక్షలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.
ఈ ప్లాట్ఫామ్ను క్షిపణులు, విమాన భాగాలు, ఎజెక్షన్ సీట్లు, పారాచూట్ వ్యవస్థలు, కవచ ప్లాట్ఫారమ్లు, ఇతర సైనిక పరికరాలను కఠినమైన పరిస్థితులలో మూల్యాంకనం చేయడానికి ఉపయోగిస్తారు. భారతదేశపు గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమానికి సంబంధించిన సిబ్బంది తప్పించుకునే వ్యవస్థ (క్రూ ఎస్కేప్ సిస్టమ్), పారాచూట్ వ్యవస్థలను పరీక్షించడంలో కూడా ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.
సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ (ఎస్ఎఫ్ డిఆర్)
సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ (ఎస్ఎఫ్ డిఆర్) సాంకేతికత అనేక విజయవంతమైన పరీక్షలను పూర్తి చేసుకుంది. భవిష్యత్ క్షిపణి వ్యవస్థలకు ఇది ఒక కీలకమైన నిర్మాణ అంశంగా పరిగణించబడుతుంది. ఇది సాలిడ్ ఫ్యూయల్ ప్రొపల్షన్ను రామ్జెట్ సాంకేతికతతో మిళితం చేస్తుంది. దీనివల్ల క్షిపణులు తమ ప్రయాణమంతా నిరంతర చోదక శక్తిని కొనసాగించగలుగుతాయి.
సాంప్రదాయ రాకెట్ మోటార్లతో పోలిస్తే, ఎస్ఎఫ్ డిఆర్ ఆధారిత క్షిపణులు ఎక్కువ పరిధిని మరియు అధిక వేగాన్ని సాధించగలవు, అదే సమయంలో లక్ష్య సాధన చివరి దశలో ఎక్కువ శక్తిని నిలుపుకోగలవు. ఈ సాంకేతికత భవిష్యత్ సుదూర గగనతల-గగనతల, భూ ఉపరితల-గగనతల క్షిపణి వ్యవస్థలకు పునాది వేస్తుందని భావిస్తున్నారు. ఇది అధునాతన క్షిపణి చోదక శక్తిలో స్వావలంబన దిశగా ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది.
గాలి నుండి జారవిడిచే కంటైనర్ (ఎడిసి)
భారత సాయుధ దళాల ఉపయోగం కోసం గాలి నుండి జారవిడిచే కంటైనర్ (ఎడిసి)ను అభివృద్ధి చేశారు. దీని పరీక్షలు, మెరుగుదలలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక సైనిక కంటైనర్ను, రవాణా విమానాల నుండి పారాచూట్లను ఉపయోగించి దించేందుకు రూపొందించారు. ఇది మారుమూల పర్వత ప్రాంతాలకు, ముందు వరుస సైనిక స్థావరాలకు, విపత్తు ప్రభావిత ప్రాంతాలకు కీలకమైన సామాగ్రిని వేగంగా చేరవేయడానికి వీలు కల్పిస్తుంది.
ఈ కంటైనర్ మందుగుండు సామగ్రి, ఆహార సరఫరాలు, వైద్య పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర అవసరమైన వస్తువులను మోయగలదు. దీని రూపకల్పన, ల్యాండింగ్ సమయంలో లోపల ఉన్న వస్తువులకు కనీస నష్టం జరిగేలా నిర్ధారిస్తుంది. ఇది సైనిక లాజిస్టిక్స్ మరియు మానవతా కార్యకలాపాలకు ఒక విలువైన ఆస్తిగా నిలుస్తుంది.
అధునాతన సాయుధ ప్లాట్ఫారమ్ డిఆర్డిఓ అధునాతన సాయుధ ప్లాట్ఫారమ్ సాంకేతికతలు స్వదేశీ సాయుధ వాహనాలు, భవిష్యత్ యుద్ధ వ్యవస్థలలో పొందుపరుస్తున్నారు. ఈ ప్లాట్ఫారమ్లు దళాల రక్షణ, చలనశీలత మరియు యుద్ధరంగ సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందిస్తున్నారు. వీటిలో అధునాతన బాలిస్టిక్ రక్షణ, మైన్ నిరోధకత మరియు అణు, జీవ, రసాయన (ఎన్ బిసి) రక్షణ వ్యవస్థలు ఉన్నాయి.
ఈ ప్లాట్ఫారమ్లు అధునాతన సెన్సార్లు, నిఘా పరికరాలు, నైట్-విజన్ సామర్థ్యాలు, రిమోట్ వెపన్ స్టేషన్లను కూడా ఏకీకృతం చేయగలవు.తద్వారా ఇవి ఆధునిక నెట్వర్క్-సెంట్రిక్ యుద్ధ వాతావరణాలకు అనువుగా ఉంటాయి.
అల్ట్రా లైట్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ (యుఎల్ పిజిఎం)
అల్ట్రా లైట్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ (యుఎల్ పిజిఎం) పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఈ తేలికపాటి ప్రెసిషన్-గైడెడ్ మిస్సైల్ను హెలికాప్టర్లు, డ్రోన్లు, , తేలికపాటి యుద్ధ ప్లాట్ఫారమ్ల నుండి ప్రయోగించవచ్చు. శత్రువుల ట్యాంకులు, బంకర్లు పటిష్టమైన స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయడానికి రూపొందించిన ఈ క్షిపణి, భారతదేశపు ట్యాంక్ వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది.
దీని ముఖ్య లక్షణాలలో ‘ఫైర్-అండ్-ఫర్గెట్’ సామర్థ్యం మరియు అసాధారణమైన కచ్చితత్వం ఉన్నాయి. ఇవి, అతి తక్కువ ఆపరేటర్ జోక్యంతో లక్ష్యాలను వేగంగా ఛేదించడానికి వీలు కల్పిస్తాయి.
అతి స్వల్ప శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ (విఎస్ హెచ్ఓఆర్ఏడి)
అతి స్వల్ప శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ (విఎస్ హెచ్ఓఆర్ఏడి) విమాన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. దీనిని సాయుధ దళాలలోకి చేర్చే ప్రక్రియ ముందుకు సాగుతోంది. ముందు వరుస దళాలకు, వ్యూహాత్మక ఆస్తులకు ముప్పు కలిగించే, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను నిర్వీర్యం చేయడానికి ఈ వ్యవస్థను రూపొందించారు.
అధునాతన ఇన్ఫ్రారెడ్ సీకర్తో కూడిన విఎస్ హెచ్ఓఆర్ఏడి, వేగవంతమైన ప్రతిచర్య సమయాన్ని, లక్ష్యాన్ని ఛేదించే అధిక సంభావ్యతను అందిస్తుంది. డ్రోన్ యుద్ధం ఒక ప్రధాన భద్రతా సవాలుగా మారుతున్న తరుణంలో, ఈ వ్యవస్థ భారతదేశపు వాయు రక్షణ సామర్థ్యాలను, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, ఫార్వర్డ్ ఆపరేషనల్ జోన్లలో గణనీయంగా బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
భారతదేశ రక్షణ స్వావలంబనను నడిపించడం
ఈ సాంకేతికతలన్నీ కలిసి, భారతదేశ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో డిఆర్డిఓ విస్తరిస్తున్న పాత్రను స్పష్టం చేస్తున్నాయి. క్షిపణి చోదక వ్యవస్థలు, కచ్చితమైన దాడుల వ్యవస్థల నుండి సైనిక లాజిస్టిక్స్, సాయుధ యుద్ధం, వాయు రక్షణ, అంతరిక్ష యాత్రల మద్దతు వరకు, డిఆర్డిఓ అన్ని రంగాలలో కీలకమైన స్వదేశీ సామర్థ్యాలను నిర్మిస్తోంది. భారతదేశం తన సాయుధ బలగాలను ఆధునీకరించుకుంటూ, విదేశీ సాంకేతికతలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్న తరుణంలో, దేశ భవిష్యత్ సైనిక, వ్యూహాత్మక సామర్థ్యాలను తీర్చిదిద్దడంలో ఈ ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

More Stories
టిఎంసిలో తిరుగుబా టుకు అభిషేక్ బెనర్జీ అహంకారమే కారణమా?
కోల్కతా కాలేజీ గదుల్లో రూ 1 కోటి నగదు, గన్, బెడ్స్, కండోమ్స్
తెలంగాణాలో రూ 7,597 కోట్లతో రెండు రహదారుల విస్తరణ