క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో క్యాబినెట్ విస్త‌ర‌ణ క‌ల‌క‌లం

క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో క్యాబినెట్ విస్త‌ర‌ణ క‌ల‌క‌లం
 
* ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. సిద్దరామయ్య గైరాజర్
 
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన వేళ పార్టీలో అసంతృప్త జ్వాల‌లు వెల్లువెత్తాయి.  సోమవారం లోక్‌భవన్‌లో గవర్నర్ గెహ్లాట్ 20 మంతి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.  అయితే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రముఖ కురుబ నాయకురాలు గాయత్రి శాంతే గౌడను చివరి నిమిషంలో మంత్రివర్గం నుంచి తొలగించడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు.
 
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ శాసనసభ్యులు పిఎం నరేంద్రస్వామి (మలవల్లి), శివరాజ్ తంగడగి (కనకగిరి), రుద్రప్ప లమాని (హావేరి), కెఎస్ బసవంతప్ప (మాయకొండ), బి నాగేంద్ర (బళ్లారి రూరల్), టి రఘుమూర్తి (చల్లకెరె), బి జమీర్ అహ్మద్ (ఎస్‌ఛామరాజ్), రిజ్వామ్‌రాజ్‌ఖాన్ లాడ్ (కలఘటగి), మధు బంగారప్ప (సొరబ), పుత్తురంగశెట్టి (చామరాజనగర), ఎస్ ఎస్ మల్లికార్జున్ (దావణగెరె నార్త్). 
 
అజయ్ సింగ్ (జేవర్గి), ఎన్ చలువరాయ స్వామి (నాగమంగళ), కెఎం శివలింగేగౌడ (అరసికెరె), హెచ్‌సి బాలకృష్ణ (మాగడి), బస్వరాజ్ రాయరెడ్డి (యలబుర్గా), విజయానంద్ కాశప్పనవర్ (బాగలకోటే), లక్ష్మణ్ సవాడి (అథని) కూడా ప్రమాణం చేశారు.
 
క్యాబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశవంతరాయగౌడ వి పాటిల్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణికి అందజేశారు.
 
“నాకు పార్టీ నాయకత్వం తీవ్రంగా నిరాశ కలిగించింది. ఇది కేవలం మంత్రి పదవి విషయం మాత్రమే కాదు. కొంతకాలంగా పార్టీ వ్యవహరిస్తున్న తీరు బాధ కలిగించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని వెల్లడించారు. అలాగే, బేలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ సైతం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి,  తమతోపాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

బెంగళూరులోని డాలర్ కాలనీలో సీనియర్ ఎమ్మెల్యే పీ.వి. జయచంద్ర నివాసంలో సోమవారం జరిగిన రహస్య సమావేశంలో ఈ అసంతృప్తి బహిర్గతమైంది. ఈ సమావేశానికి 12 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తుది మంత్రివర్గ జాబితాలో చోటు దక్కని ఆశావహులు తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సీనియర్ నేతలు హెచ్.కే. పాటిల్, దినేష్ గుండు రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కేబినెట్‌లో చోటు దక్కని వారితో పాటు, ఇప్పటికే మంత్రి అయిన సీనియర్ నేత కె.హెచ్. మునియప్ప కూడా తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు మరో శాఖ ఇవ్వాలని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ గాంధీతో కూడా ప్రస్తావించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

డీకే శివకుమార్ ప్రభుత్వం చేపట్టిన కేబినెట్ విస్తరణలో చివరి నిమిషంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత జాబితాలో ఉన్న మంకల్ వైద్య, గాయత్రి చంద్రశేఖర్ పేర్లు చివరి క్షణంలో తొలగించగా, సీనియర్ నేత ఎస్.ఎస్. మల్లికార్జునకు అవకాశం లభించింది.

“చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరికీ పదవులు కల్పించడం సాధ్యం కాదు. గతంలో సిద్ధరామయ్య మంత్రివర్గంలో నాకు కూడా మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆ తర్వాత నేను మంత్రిని అయ్యాను కదా? అదేవిధంగా, భవిష్యత్తులో అందరికీ అవకాశాలు కల్పిస్తాం. ప్రస్తుతం నేను లోక్ భవన్‌కు వెళ్తున్నాను,” అని శివకుమార్ విలేకరులతో పేర్కొన్నారు.

కేబినెట్ విస్తరణను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. పార్టీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా మాట్లాడుతూ, కాంగ్రెస్ సామాజిక న్యాయం, యువతకు ప్రాధాన్యం, సమగ్ర ప్రాతినిధ్యం వంటి హామీలను నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. కొత్త మంత్రివర్గంలో ఒక్క మహిళకు మాత్రమే అవకాశం కల్పించడం, యువ నేతలను పక్కన పెట్టడం, బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడం, వివాదాల్లో ఉన్న నేతలకు చోటు కల్పించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ మంత్రివర్గం కాంగ్రెస్ ప్రకటించిన విలువలకు విరుద్ధంగా ఉందని ఆయన విమర్శించారు.