భారత సైన్యానికి సంఘీభావంగా సిఎం రేవంత్ భారీ ర్యాలీ

భారత సైన్యానికి సంఘీభావంగా సిఎం రేవంత్ భారీ ర్యాలీ

భారత సాయుధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్‌‌’కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు ప్ర‌క‌టించారు. ఈ నేపథ్యంలో సైన్యానికి సంఘీభావంగా గురువారం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుండి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ తన భుజాన జాతీయ జెండా వేసుకొని పాల్గొనడం విశేషం.

ఈ ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అలాగే, ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని భారత సైనిక దళాలకు సంఘీభావం తెలిపారు. ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. 

ఆ కార్యక్రమానికి సైన్యం, నౌకాదళం, వైమానిక దళానికి చెందిన అధికారులు, సచివాలయ ఉద్యోగులతోపాటు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ముష్కరుల దాడిలో అమరులైన వారికి అంజలి ఘటించారు. దేశ పౌరుడిగా మన సాయుధ దళాలకు అండగా నిలుస్తున్నామన్న ఆయన అంతా ఒకే గొంతుకై, ఒకే స్వరంతో గళం వినిపిద్దామని పిలుపునిచ్చారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత సార్వభౌమత్వం మీద దాడి చేయాలని చూసేవారికి ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పాక్‌ ఉగ్రవాదులు, పాక్‌ పాలకులు, అంతర్జాతీయ ముఖచిత్రంలో ఉన్న ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత సార్వభౌమత్వంపై దాడి చేయాలనుకుంటే ఈ భూమ్మీద మీకు నూకలు చెల్లినట్లేనని, ఈ భూమ్మీద మీరు నివసించేందుకు అర్హత కోల్పోయినట్లేని స్పష్టం చేశారు.

ఈ సమయంలో ప్రతి పౌరుడు భారత సైనికులకు అండగా నిలబడాలని కోరారు. మనమందరం ఒకే గొంతుకై, ఒకే స్వరంతో గళం వినిపిద్దామని చెప్పారు. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేసిన దాడులు మనల్ని గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. మన ఆడబిడ్డల నుదిటి సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌‌తో గట్టి గుణపాఠం చెప్పిందని కొనియాడారు. 

మన‌ శాంతి స్వరూపాన్ని చేతగానితనంగా భావించి దాడుల‌కు పాల్పడితే, దాడి చేసిన వారికి భూమి మీద నూకలు ఉండవని స్పష్టం చేశారు. మన దేశ సమగ్రతను సవాలు చేసే వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని, భార‌త్ త‌లుచుకుంటే… ప్రపంచ పటం నుండి పాకిస్తాన్‌ను తుడిచిపెట్టగలదని సీఎం రేవంత్ హెచ్చరించారు.