
భద్రాత దళాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ తో దండకారణ్యం మళ్లీ దద్దరిల్లుతోంది. ఒక వైపు ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దు, మరో వైపు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు అడవుల్లో తుపాకీల మోతతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పచ్చని చెట్ల కింద సేద తీర్చుకుని అటవి ప్రాంతంలో ఒక వైపు తుపాకీ తూటలు, మరోవైపు మందుపాతరలతో నెత్తురోడుతుంది.
అడవిలో ఒక వైపు మావోయిస్టులు, మరో వైపు పోలీసులు ప్రాణాలు వీడుతున్నారు. పచ్చని ప్రాంతంలో రక్తం చిందస్తుంటే అరణ్యం రోదిస్తుంది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ ఉన్నారు.
బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 24 మంది మృతి చెందారు. కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది, అల్లూరు సీతారామారాజు జిల్లా వైరామవరం మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మృతి చెందారు. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులపై భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి. కర్రెగుట్టల్లో ఆపరేషన్ ప్రారంభమై 17వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్కౌంటర్లలో 34 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే మావోయిస్టులు అమర్చిన మందుపాతరలకు ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అలాగే ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
మరోవంక, ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అల్లూరి జిల్లా అరకులోయ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నక్సల్స్ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు అగ్రనేతలు జగన్ అలియాస్ పండన్న, రమేష్ అలియాస్ నాగన్న ఉన్నారు. జీకేవీధి ఏజెన్నీలో కూంబింగ్ కొనసాగుతోంది. జీకే వీధి ఏజెన్సీలో మావోయిస్టులున్నారనే పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టారు పోలీసులు. దీంతో ఇద్దరి మధ్య కాల్పులు చోటుచేసుకోగా నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో మావోయిస్టు కీలక నేత జగన్ అలియాస్ పండన్న చనిపోయారు. జగన్పై రూ.20 లక్షల రివార్డ్ ఉంది.
ఇక మరో ఇద్దరు మావోయిస్టులు సంకు నాచికా, రమేష్ మృతి సైతం మృతిచెందగా అతనిపై రూ. 5 లక్ష రివార్డ్ ఉంది. ఇక నాగన్న మల గెట్ట గ్రామం, కలిమెలా బ్లాక్, మల్కన్ గిరి జిల్లా ఒడిస్సా రాష్ట్రం డిసిఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొమ్ములవాడ గ్రామానికి చెందిన.. కాకూరి పండన్న ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, వాజేడు మండలంలో మావోయిస్టుల మందుపాతరకు ఐదుగురు పోలీసులు బలయ్యారు. వాజేడు మండలం పెనుగోలు, గుట్టలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎలిమిడి గుట్టల మధ్య గ్రేహౌండ్స్ బలగాలు వాగు దాటుతుండగా చంద్రన్న దళం మందుపాతరను పేల్చింది. ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
మరోవంక, తెలంగాణాలో ఆరు నెలలు కాల్పుల విరమణ పాటించనున్నట్టు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట గురువారం లేఖ విడుదలైంది. శాంతిచర్చలు జరపాలని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ, ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తోందన్నారు. సీపీఐ(ఎం), ఇతర వామపక్షాలు ఇప్పటికే ఈ డిమాండ్తో కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు.
More Stories
కాళేశ్వరం కమిషన్ బ్లాక్ మెయిల్ కోసమా?
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
సింధు కాల్వలపై తిరగబడుతున్న సింధూ ప్రాంత ప్రజలు