
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ల తర్వాత సరిహద్దుల్లో యుద్దవాతావరణం నెలకొన్న సమయంలో హైదరాబాద్ లో ప్రఖ్యాతి చెందిన కరాచీ బేకరీ యజమానులు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఈ బేకరీ పేరు కరాచీ పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో ఒకటైన కరాచీ నగరాన్ని సూచిస్తుంది. కరాచీ బేకరి పేరు మార్చాలంటూ రెండ్రోజుల క్రితం విశాఖలోని కరాచీ బేకరీపై హిందూ జన జాగరణ సమితి సభ్యులు దాడి చేశారు.
గతంలో 2019 పుల్వామా దాడుల అనంతరం కూడా బెంగళూరులో కరాచీ బేకరీపై దాడి జరిగింది. కరాచీ పేరును కప్పివుంచే వరకు నిరసనకారులు ఊరుకోలేదు. దీంతో హైదరాబాద్ నగరంలోని కరాచీ బేకరీల ముందు ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేశారు. తమను భారతీయులుగానే గుర్తించండి అంటూ కరాచీ బేకరీ యాజమాన్యం ప్రత్యేకంగా బోర్డులు పెట్టింది.
దేశ విభజన తర్వాత తాము పాకిస్తాన్ నుంచి వలస వచ్చి 1953 లోనే ఇక్కడ వ్యాపారం ప్రారంభించామంటూ బోర్డులు పెట్టారు. కరాచీ బేకరీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. విదేశాల్లో సైతం ఔట్లెట్లు స్థాపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కరాచీ బేకరీ బ్రాంచెస్ ఉన్నాయి.
కరాచీ బేకరి వ్యవస్థాకుడి వారసులు మీడియాతో మాట్లాడుతూ.. తమకు మద్దతివ్వాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, కమిషనర్లను అభ్యర్థించారు. “కరాచీ బేకరి స్థాపించి 70 ఏళ్లకు పైనే అవుతోంది. 1947లో దేశ విభజన జరిగిన సమయంలో సింధీ హిందూ అయిన మా తాత గారు ఖాన్చంద్ రామ్నాని కరాచీ నుంచి హైదరాబాదుకు వలస వచ్చారు. ఆ తర్వాత 1953లో మొజాంజాహి మార్కెట్లోని సీనా బేకరీ పక్కన హైదరాబాదులో మొదటి కరాచీ బేకరీని ప్రారంభించారు” అని వారు తెలిపారు.
ఒక్క హైదరాబాద్ నగరంలోనే తమకు (కరాచీ బేకరి) 23 శాఖలు ఉన్నాయని చెప్పారు. ‘మాది ఇండియానే. ఇది పాకిస్థాన్ బ్రాండ్ కాదు. దయచేసి పేరు మార్చుకోమని చెప్పవద్దు. ఈ విషయంలో తెలంగాణ సీఎం సాబ్, డీజీపీ, కమిషనర్ మాకు మద్దతివ్వాలని కోరుతున్నాం’ అని ఖాన్చంద్ రామ్నాని వారసులు అభ్యర్థించారు.
More Stories
కాళేశ్వరం కమిషన్ బ్లాక్ మెయిల్ కోసమా?
తెలంగాణ రాజ్భవన్లో మార్ఫింగ్ రచ్చ
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు