తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో హై అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో హై అలర్ట్
* తెలుగు విద్యార్థులకు ఢిల్లీలో టోల్ ఫ్రీ నంబర్లు

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కూకట్‌పల్లి, నాంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ బస్‌స్టేషన్, ట్యాంక్‌బండ్‌తో పాటు ఏపీలోని తిరుమల, విశాఖ ఆర్కే బీచ్, విజయవాడ రైల్వేస్టేషన్, విజయవాడ బస్‌స్టాండ్, ఎంజీ రోడ్‌లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. 

హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ జోన్‌లో ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ కొనసాగుతోంది. డీజీ స్థాయి అధికారి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షణలోనే సూచనలు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని పోలీసులు, ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాచారాన్నే నమ్మాలని పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లోని ఆరు హైఅలర్ట్ జోన్లలో అక్టోపస్, లా అండ్ అండ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాయి. పాక్ దాడుల నేపథ్యంలో టీటీడీ అధికారులను కేంద్ర హోంశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. తిరుమలలో  తీసుకువాల్సిన భద్రతా చర్యలపై టీటీడీ అధికారులకు కేంద్ర హోం శాఖ అధికారులు పలు సూచనలను చేశారు. కేంద్రం ఆదేశాలు మేరకు తిరుమల్లో భద్రతను టీటీడీ మరింత పటిష్టం చేసింది.

జమ్మూ, శ్రీనగర్, పంజాబ్ యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతోమంది చదువుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే జమ్మూ శ్రీనగర్, పంజాబ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులతోపాటు తెలుగువారి కోసం ఢిల్లీ ఏపీ భవన్‌లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

పంజాబ్ జమ్మూ కశ్మీర్‌లో యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులను బయటకు వెళ్లకుండా కేంద్రం ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. అత్యవసరమైతే విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏపీ భవన్‌లో సమాచారం అందించడానికి ఎంవీఎస్ రామారావు డిప్యూటీ కమిషనర్, సురేష్ బాబు లైజన్ ఆఫీసర్ అందుబాటులో ఉన్నారు. సమాచారం కోసం ఈ నెంబర్‌లో 9818395787 సంప్రదించాలని కోరారు.

అదేవిధంగా భార‌త్ – పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో ఉంటున్న‌, చిక్కుకున్న‌ తెలంగాణ వాసుల కోసం ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లోని వారికి సాయం, స‌మాచారం, సేవ‌ల కోసం కంట్రోల్ రూమ్‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. 

హెల్ప్ లైన్ నంబ‌ర్లు ఇవే

కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ నంబ‌ర్ – 011 – 23380556
రెసిడెంట్ క‌మిష‌న‌ర్ ప్రైవేట్ సెక్ర‌ట‌రీ, లైజ‌న్ హెడ్ నంబ‌ర్ – 9871999044
రెసిడెంట్ క‌మిష‌న‌ర్ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడి నంబ‌ర్ – 9971387500
తెలంగాణ భ‌వ‌న్‌లో లైజ‌న్ ఆఫీస‌ర్ నంబ‌ర్ – 9643723157
తెలంగాణ భ‌వ‌న్‌లో ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీస‌ర్ నంబర్ – 9949351270