భారత్​తో దూకుడు వ్యవహరించవద్దు.. దౌత్యం మేలు

భారత్​తో దూకుడు వ్యవహరించవద్దు.. దౌత్యం మేలు
 
* పాక్ ప్రధానికి మాజీ ప్రధాని, అన్న నవాజ్ హితవు 

భారత్​- పాక్​ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్,​ ప్రస్తుత ప్రధాని షెహబాజ్​ షరీఫ్​కు కీలక సూచనలు చేశారు. భారత్​తో దూకుడు వ్యవహరించవద్దని, దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. అంతేకాదు భారతదేశంతో సంప్రదింపులు జరిపేందుకు వ్యక్తిగతంగా నవాబ్​ షరీఫ్​ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

భారత్‌- పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్న వేళ పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ రెండు రోజుల క్రితం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు సహా అధికార పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ (పిఎంఎల్-నవాజ్) పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూడా హాజరయ్యారు. 

ప్రభుత్వంలో ఎటువంటి పదవీ లేకున్నా, కేవలం అధికార పార్టీ అధ్యక్షుడి హోదాలో నవాజ్ షరీఫ్​ ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవాజ్‌ మాట్లాడుతూ, “భారత్‌తో దూకుడుగా వ్యవహరించవద్దని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు చేయాలి” అని తన సోదరుడు, పాక్​ పీఎం అయిన షెహబాజ్‌ షరీఫ్‌కు సూచించినట్లు తెలిసింది. 

అంతకాదు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేసేందుకు లండన్‌ నుంచి నవాజ్ షరీఫ్​ వచ్చారని, ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, 1999లో కార్గిల్‌ యుద్ధం జరిగిన సమయంలో నవాజ్‌ షరీఫ్‌ పాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు.

పహల్గాం దాడి అనంతరం నవాజ్ షరీఫ్‌తో పాక్​ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్​ భేటీ అయ్యారు. భారత్‌ చర్యలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. భారత్​ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని ఆయన ఆరోపించారు. నవాజ్‌ మాత్రం, దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని ప్రధానికి సూచించినట్లు తెలుస్తోంది.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాకిస్థాన్​లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దీనితో ఉక్కిరిబిక్కిరి అయిన పాకిస్థాన్​, పరువు నిలబెట్టుకోవడం కోసం భారత్​పై హమాస్​ ఉగ్రవాదుల తరహాలో దాడులకు పాల్పడుతోంది. దీనితో దీటుగా స్పందించిన భారత్, పాకిస్థాన్​కు చెందిన ఫైటర్ జెట్లను, డ్రోన్​లను, క్షిపణ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. దీనితో ఇరు దేశాల మధ్య మరింతగా ఉద్రిక్తలు పెరిగాయి.

గతంలో 2023లో తాను భారత్ తో మంచి సంబంధాలు కోరుకొంటున్నట్లు నవాజ్ షరీఫ్ చెప్పారు.1999లో కార్గిల్ యుద్దాన్ని వ్యతిరేకించిన కారణంగానే తన ప్రభుత్వాన్ని కూలదోశారని ఆరోపించారు. 1999లో భారత్ తో చేసుకున్న ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించినట్లు ఆయన అంగీకరించారు.  “మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత వాజ్‌పేయి సాహెబ్ ఇక్కడికి వచ్చి మాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాము… అది మా తప్పు” అని మాజీ ప్రధాని తెలిపారు. 
 
షరీఫ్ ప్రస్తావించిన ఒప్పందం “లాహోర్ డిక్లరేషన్”, దీనిపై ఆయన, అప్పటి భారత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఫిబ్రవరి 21, 1999న భారతదేశం, పాకిస్తాన్ మధ్య శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో సంతకం చేశారు. అయితే, సంతకం చేసిన కొద్దికాలానికే, పాకిస్తాన్ దళాలు జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలోకి చొరబడ్డాయి. ఇది కార్గిల్ యుద్ధానికి దారితీసింది.