బలూచిస్తాన్‌లో పాక్ సైన్యంపై దాడులను ముమ్మరం

బలూచిస్తాన్‌లో పాక్ సైన్యంపై దాడులను ముమ్మరం
 
* క్వెట్టాను స్వాధీనం చేసుకున్న బీఎల్ఏ
 
పాకిస్తాన్ ఒకవైపు భారత్‌పై డ్రోన్, మిసైల్ దాడులతో గందరగోళంలో ఉంటే, మరోవైపు బలూచిస్తాన్‌లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యంపై దాడులను ముమ్మరం చేశారు. బలూచ్ యోధులు మూడు సమూహాలుగా విడిపోయి, పాకిస్తాన్‌లోని పశ్చిమ ప్రాంతమైన బలూచిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు.  ఒకవైపు భారత ఆర్మీ పాక్ మీద విరుచుకుపడుతుండగా, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడి చేస్తోంది. 
బలూచిస్థాన్‌ను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకునే దిశగా బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ’ (బీఎల్‌ఏ), ఇతర వేర్పాటువాద గ్రూప్‌లు అడుగులు వేస్తున్నాయి. తాము స్వాతంత్య్రం పొందామని బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. బలూచిస్థాన్‌లో వరుస దాడులతో పాక్‌ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
భారత్‌పై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసేందుకు పాక్‌ సైన్యం ప్రణాళికలు రచిస్తుంటే.. బలూచిస్థాన్‌లో కీలక ప్రాంతాలపై బీఎల్‌ఏ పట్టు సాధిస్తున్నది. బాంబుదాడులు, బుల్లెట్లతో విరుచుకుపడుతూ అక్కడ గస్తీ కాస్తున్న పాక్‌ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మొత్తంగా ఇటు తూర్పు ప్రాంతమైన భారత్‌ నుంచి, అటు పశ్చిమ ప్రాంతమైన బలూచిస్థాన్‌ నుంచి జరుగుతున్న దాడులతో పాకిస్థాన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.
ప్రొవిన్షియల్ రాజధాని క్వెట్టాతో అన్ని ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమికొట్టామని, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్ర‌క‌టించింది.  క్వెట్టాలోని పాకిస్థాన్ దళాల ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. బలూచి తిరుగుబాటుదారులు క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, పాకిస్థాన్ సైన్యాన్ని అక్కడ నుంచి తరిమేశారని మీడియా వెల్ల‌డించింది.
బలూచ్ స్వాతంత్ర్య గ్రూపులు గురువారం పాక్ సైన్యం, వారి ఆస్తులపై బలూచిస్తాన్‌లో ఒక్కసారిగా దాడులు చేశాయి.  బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో గురువారం పాక్ భద్రతా దళాలు దాదాపు నాలుగు దాడులను ఎదుర్కొన్నాయి. ఈ దాడులను “గుర్తుతెలియని సాయుధ దుండగులు” చేసినట్లు బలూచిస్తాన్‌కు చెందిన రేడియో జ్రుంబేష్ తెలిపింది. పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత వారం రోజులుగా ఈ దాడులు వేగం పుంజుకున్నాయి.
బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పాకిస్తాన్ జెండాలను తొలగించి, బలూచ్ జెండాలను ఎగురవేస్తున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.  దానితో పాకిస్థాన్ మ‌రోసారి రెండు ముక్క‌లు కానుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  1971లో తూర్పు పాకిస్తాన్‌లో రాజకీయ, ఆర్థిక అసమానతలు, బెంగాలీ భాషా ఉద్యమం కారణంగా ప్రజలు పాకిస్తాన్ పాలనపై తిరుగుబాటు చేశారు. ఇది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి దారి తీసింది. 
బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 నాటి భీకరమైన యుద్ధం దాదాపు 13 రోజులు కొనసాగి, డిసెంబర్ 16వ తేదీన ముగిసింది. ఈ యుద్ధంలో భారత సైనిక బలగాల దెబ్బకు పాకిస్థాన్ సైనికులు తోకముడిచి పారిపోయారు.  పాకిస్థాన్ ఆర్మీ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ తన 93,000 మంది సైనికులతో, భారత సైన్యం, ముక్తి-బాహిని ముందు లొంగిపోయారు. దీంతో తూర్పు పాకిస్తాన్ విభజనకు దారితీసింది. బంగ్లాదేశ్ అని పిలిచే కొత్త దేశంగా ఆవిర్భవించింది.  పాకిస్తాన్ సైన్యాలను ఓడించి, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది.
మళ్లీ అలాంటి పరిస్థితులే ఇప్ప‌డు బ‌లూచిస్థాన్‌లో క‌నిపిస్తున్నాయి. బలూచిస్థాన్‌ పాకిస్థాన్‌లో భాగంగా ఉన్నా అక్కడి పౌరులకు స్వేచ్ఛ లేదు. విద్య, వైద్యం అందని ప‌రిస్తితి. పాకిస్థాన్‌లో 44 శాతం విస్తీర్ణం ఉన్న బలూచిస్థాన్‌ ప్రాంతాన్ని పాక్‌ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అక్కడి ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నాయి. దీంతో స్వతంత్ర దేశంగా ప్రకటించాల‌ని అక్కడి పౌరులు 75 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు పాక్‌పై భారత్‌ దాడి నేపథ్యంలో బలూచీలు తమ కలను సాకారం చేసే దిశలో ముందుకు సాగుతున్నారు.

బ్రిటిష్‌ వారు 1947 ఆగస్టు 15న భారత్‌-పాకిస్థాన్‌ను విభజించి, స్వాతంత్య్రం ప్రకటించినా బలూచిస్థాన్‌ ప్రాంతం ‘ఖాన్‌ ఆఫ్‌ కలాత్‌’ అనే రాజు పాలనలో కొనసాగింది. అయితే, 1948 మార్చిలో పాకిస్థాన్‌ ప్రభుత్వం సైనిక చర్యను చేపట్టి.. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. పాకిస్థాన్‌లో విలీనం చేసుకుంది. పాకిస్థాన్‌ విస్తీర్ణంలో బలూచిస్థాన్‌ వాటా 44శాతంగా ఉంటుంది. అయితే, పాక్‌ జనాభాలో బలూచీల వాటా 7-8 మాత్రమే. 

పాక్‌ దురాక్రమణ నుంచి ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని వనరులను పాకిస్థాన్‌, చైనా దోచుకుంటున్నాయి. యువకులను పాక్‌ సైన్యం అపహరిస్తోంది. అలా అదృశ్యమయ్యే వారి జాడ నేటికీ తెలియలేదంటే బలూచీల దుర్భర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2000లో బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ఆవిర్భవించింది. స్వతంత్ర బలూచిస్థాన్‌ దేశం కోసం గెరిల్లా యుద్ధాలతో పాకిస్థాన్‌ సైన్యంపై దాడులు చేసేది. క్రమంగా బీఎల్‌ఏ బలం పుంజుకుంది.

పాకిస్థాన్‌ సైనికులు, వారి కార్యాలయాలు, కంటోన్మెంట్‌ ప్రాంతాలు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలను టార్గెట్‌గా చేసుకుని, దాడులు జరుపుతోంది. ప్రస్తుతం బీఎల్‌ఏ చీఫ్‌గా బషీర్‌ జైబ్‌ వ్యవహరిస్తున్నారు. 2018 వరకు ఆయన సోదరుడు అస్లాం బలూచ్‌ ఈ పదవిలో ఉండేవారు. ఆయన మరణం తర్వాత బషీర్‌ జైబ్‌ బాధ్యతలను స్వీకరించాక బీఎల్‌ఏ మరింతగా పుంజుకుంది. గెరిల్లా పోరుతోపాటు అధునాతన ఆయుధాల వినియోగం, ఐఈడీల ప్రయోగాలు పెరిగాయి. 

ఆయన నేతృత్వంలోని బీఎల్‌ఏ గ్వాదర్‌ పోర్టు వద్ద చైనా ఇంజనీర్లు, వారి వాహనాలపై ఐఈడీ దాడులు చేస్తోంది. తాజాగా మంగళ, బుధవారాల్లోనూ బలూచిస్థాన్‌లో ఐఈడీలు పేల్చి, 21 మంది సైనికులను హతమార్చింది. ఇటీవల క్వెట్టా-పెషావర్‌ మధ్య నడిచే జాఫర్‌ ఎక్స్‌ప్రె్‌సను హైజాక్‌ చేసి, సంచలనం సృష్టించింది. స్వతంత్ర దేశంగా బలూచిస్థాన్‌ను సాధించడానికి పోరాటాలను ముమ్మరం చేసింది.

పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ

మంగళవారం, బోలాన్ , కెచ్ జిల్లాల్లో జరిగిన రెండు ప్రాణాంతక ఐఇడి దాడులకు ఆ గ్రూప్ బాధ్యత వహించింది. ఈ దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది మరణించారు. బోలాన్‌లో, స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిక్ ఇమ్రాన్ , సుబేదార్ ఉమర్ ఫరూక్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను షోర్కండ్ ప్రాంతంలో రిమోట్-కంట్రోల్డ్ పరికరం పేల్చివేసింది.  దానిలో ఉన్న 12 మంది సైనికులు మరణించారు.

కెచ్‌లోని బాంబు నిర్వీర్య దళాన్ని లక్ష్యంగా చేసుకుని మరొక బాంబు దాడి జరగగా, మరో ఇద్దరు మరణించారు.   తమ పోరాటం `కిరాయి ఆక్రమిత దళాలు’ నుండి విముక్తి కోసం అంటూ బిఎల్ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలోచ్ ఓ ప్రకటనలో తెలిపారు. పాకిస్థాన్ సైన్యం జాతీయ సార్వభౌమాధికారంను కాపాడేందుకు కాకుండా చైనాతో సహా విదేశీ ప్రయోజనాలు కాపాడేందుకు పనిచేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. తమ దాడులు రాబోయే రోజులలో మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ “ఇది జాతీయ సైన్యం కాదు .. వ్యాపార సైన్యం” అంటూ ధ్వజమెత్తారు.

బలూచ్ రచయిత మీర్ యార్ బలోచ్, డేరా బుగ్టిలోని పాకిస్తాన్ గ్యాస్ ఫీల్డ్స్‌పై తిరుగుబాటుదారులు దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ పెట్రోలియం లిమిటెడ్ నిర్వహించే 100కు పైగా గ్యాస్ బావులు ఉన్నాయి. “పాకిస్తాన్ పతనం సమీపిస్తోందని, ఇక్కడ మేము మా స్వాతంత్రాన్ని ప్రకటించినట్లు చెప్పారు. భారత్‌లో బలూచిస్తాన్ అధికారిక కార్యాలయం, రాయబార కార్యాలయాన్ని అనుమతించాలని మేము కోరుతున్నామని మీర్3 యార్ బలోచ్ ఎక్స్‌లో రాశారు.