పాక్ కు ఐఎంఎఫ్ రూ. 7,500 కోట్లు .. భారత్ మండిపాటు

పాక్ కు ఐఎంఎఫ్ రూ. 7,500 కోట్లు .. భారత్ మండిపాటు
భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఏకంగా 1 బిలియన్ యూఎస్ డాలర్లు సాయం ప్రకటించింది. అంటే రూ. 7,500 కోట్లు అని అర్థం. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. అయితే ఐఎంఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ మండిపడింది.  పాకిస్థాన్ ఆ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వాడుకుంటోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ముందు లేవనెత్తింది. 
రుణాన్ని పాకిస్థాన్ దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఐఎంఎఫ్ లో పాకిస్థాన్ కు ఇచ్చే రుణంపై ఓటింగ్ ను భారత్ బహిష్కరించింది. ఇక పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఇదే విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఐఎంఎఫ్ తమకు 1 బిలియన్ యూఎస్ డాలర్లు అప్పు ఇచ్చిందన తెలిపింది. అయితే తాము  7 బిలియన్ యూఎస్ డాలర్లు రుణం అడగ్గా, మొదట 1 బిలియన్ యూఎస్ డాలర్లు ఇచ్చినట్లు పేర్కొంది. 
ఐఎంఎఫ్ నిర్ణయంపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత్‌ అన్ని మార్గాలపై దృష్టిపెట్టింది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అందించే బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రుణాన్ని పాకిస్థాన్‌ ఉగ్రవాదానికి నిధులను సమకూర్చేందుకు వినియోగిస్తోందని ఆరోపించింది.

పాకిస్థాన్‌కు ఆ రుణం ఇవ్వవద్దని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ పాక్‌కు రుణసాయం అందించేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. మరోవైపు పాకిస్థాన్‌కు ప్రపంచబ్యాంకు ఇచ్చే రుణంపై పునఃసమీక్ష చేయాలన్న భారత్‌ విజ్ఞప్తి మేరకు ప్రపంచబ్యాంక్‌ సమీక్ష చేసినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, “సీమాంతర ఉగ్రవాదానికి నిరంతర మద్దతు ఇవ్వడం ప్రపంచ సమాజానికి ప్రమాదకరమైన సందేశాన్ని పంపుతుంది. నిధుల సంస్థలు, దాతలను ప్రతిష్టకు ముప్పు కలిగిస్తుంది.  ప్రపంచ విలువలను దెబ్బతీస్తుంది” అని పేర్కొంది. గత కార్యక్రమ షరతులకు కట్టుబడి ఉండటంలో, స్థిరమైన సంస్కరణలను అమలు చేయడంలో ఆ దేశం విఫలమైందని పేర్కొంటూ, ఐఎంఎఫ్  సహాయం కోసం పాకిస్తాన్ పదేపదే చేసిన అభ్యర్థనలను కూడా భారతదేశం విమర్శించింది.

 
ప్రస్తుతం పాకిస్తాన్‌కు $1 బిలియన్ చెల్లింపును ఆమోదించినందుకు జమ్మూ  కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఐఎంఎఫ్ ను విమర్శించారు. “ఐఎంఎఫ్  పూంచ్, రాజౌరి, ఉరి, తంగ్‌ధర్, అనేక ఇతర ప్రాంతాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తున్న అన్ని ఆయుధాలకు పాకిస్తాన్‌కు తిరిగి చెల్లించినప్పుడు ఉపఖండంలో ప్రస్తుత ఉద్రిక్తత ఎలా తగ్గుతుందని ‘అంతర్జాతీయ సమాజం’ భావిస్తుందో నాకు ఖచ్చితంగా తెలియదు” అని ఎక్స్ లో అబ్దుల్లా రాశారు. 
 
ఐఎంఎఫ్ బోర్డు ఆమోదంతో తక్షణం $1 బిలియన్ల చెల్లింపు జరుగుతుంది. దీనితో రుణ కార్యక్రమం కింద మొత్తం చెల్లింపులు దాదాపు $2 బిలియన్లకు చేరుకున్నాయి. ఏడు అర్ధ-వార్షిక సమీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత, రుణ కార్యక్రమం కింద పాకిస్తాన్ దాదాపు $1 బిలియన్ల ఏడు సమాన వాయిదాలకు అర్హత పొందింది.  పాకిస్తాన్, ఐఎంఎఫ్ గత జూలైలో మూడు సంవత్సరాల, $7 బిలియన్ల సహాయ ప్యాకేజీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొత్త కార్యక్రమం ద్వారా దేశం స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి, బలమైన, మరింత సమగ్రమైన, స్థితిస్థాపక వృద్ధికి పరిస్థితులను సృష్టించడానికి వీలు కల్పించింది.