ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకుపైగా ప్రజలపై చైనా నిఘా

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకుపైగా ప్రజలపై చైనా నిఘా
 
చైనా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకుపైగా ప్రజలపై నిఘా పెట్టినట్లు అమెరికాకు చెందిన ఓ పత్రిక సంచలన కథనాన్ని వెలువరించింది. ఆ దేశ నిఘాలోని వారిలో సొంత పౌరులు సహా సందర్శనకు వచ్చిన విదేశీయులు కూడా ఉన్నట్లు తెలిపింది.  చైనా తన సొంత ప్రజలపై ఎలా నిఘా పెడుతుందో తెలుసుకోవడానికి జనవరిలో మార్క్ హోఫర్ అనే సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుడు ఇంటర్నెట్‌లో వెతుకుతుండగా ‘డైనమిక్ కంట్రోల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్’ అనే వెబ్‌సైట్‌లో తన పేరు, ఫొటో, పాస్‌పోర్ట్‌ సంఖ్య, గతంలో చైనా పర్యటన సమయంలో ఉపయోగించిన మొబైల్‌ నంబర్‌ సహా అన్ని వివరాలు కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆ వెబ్‌సైట్‌లో ముఖ్యంగా చైనాలోని జాంగ్‌జియాకోవు నగరానికి వెళ్లిన విదేశీయుల వివరాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వారిలో భారత్‌, తైవాన్‌, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, పాకిస్థాన్‌, సూడాన్‌ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. జాంగ్‌జియాకోవు హెబే నార్త్ యూనివర్సిటీలో చేరిన విదేశీ విద్యార్థుల సమాచారం కూడా ఇందులో ఉంది. 

అయితే వారిలో భారత్‌, పాక్‌కు చెందిన వారే అధికం కావడం గమనార్హం. ఆ వెబ్‌సైట్‌లో వారి వ్యక్తిగత వివరాలు సహా వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారనే సమాచారం నమోదై ఉన్న‌ది. వీరందరినీ చైనా అధికారులు కెమెరాలు, ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా ట్రాక్‌ చేస్తున్నారు. వారందరూ స్వదేశాలకు వెళ్లాక కూడా ఈ నిఘా కొనసాగుతుండడం గమనార్హం.

చైనాలోని పోలీస్ విభాగాలకు రోబోటిక్స్, నిఘా పరికరాలను విక్రయించే ‘ఆరిజిన్ డైనమిక్’ అనే సంస్థకు కూడా ఈ వెబ్‌సైట్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డేటా అక్కడి పోలీసులకు అందుబాటులో ఉంది. ప్రజలు ఎక్కిన విమానాలు, వారి సీటు నెంబరు, రైళ్ల వివరాలు అందులో అందుబాటులో ఉన్నాయి. 2019లో హాంకాంగ్‌లో భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చెలరేగినప్పటి నుంచి అక్కడి ప్రభుత్వం నిఘాను మరింత పెంచింది. దేశ ప్రజల విదేశీ భాగస్వాములపైనా ప్రత్యేక నిఘా ఉంచింది. అయితే ఈ సైట్‌లోని సమాచారమంతా మే నెలలో అదృశ్యం కావడం గమనార్హం.