ఈ సీజన్‌లో ఢిల్లీలో అత్యంత వేడి రోజు

ఈ సీజన్‌లో ఢిల్లీలో అత్యంత వేడి రోజు

ఈ సీజన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత దేశ రాజధాని ఢిల్లీలో నమోదైంది. సఫ్దర్‌జంగ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 38.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.ఇది ఇప్పటివరకు సీజన్‌లో అత్యంత వేడిగా నమోదైన రోజు బుధవారంగా వాతావరణశాఖ తెలిపింది. ఈ ఉష్ణోగ్రత నిన్నటి గరిష్ట ఉష్ణోగ్రత కంటే దాదాపు 2 డిగ్రీలు ఎక్కువ.  మంగళవారం సఫ్దర్‌జంగ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 37.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని, ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత గా అధికారులు గుర్తించారు.

సోమవారం ఉదయం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4.5 డిగ్రీలు ఎక్కువ.  భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం కనిష్ట ఉష్ణోగ్రత 15.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, తేమ స్థాయి 81 శాతం- 17 శాతం మధ్య ఉంది. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఆగ్రాలో 35 డిగ్రీల సెల్సియస్‌, పాట్నాలో 30, లక్నోలో 35, జైపూర్‌లో 33, ఇండోర్‌లో 33, రాంచీలో 26, రారుపూర్‌లో 35, ముంబైలో 28, అహ్మదాబాద్‌లో 32, జమ్మూలో 31, శ్రీనగర్‌లో 17 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.

దేశంలో ఈ ఏడాది కూడా ఎండలు దంచికొడుతాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా వాయవ్య భారతదేశంలో ఎండలు మండిపోనున్నాయని తెలిపింది. నార్తవెస్ట్‌ ఇండియాలో ప్రతి ఏడాది అత్యంత వేడి రోజులు నమోదవుతాయని, ఈ ఏడాది వేడి రోజుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని, అంటే 10 నుంచి 12 హీట్‌ వేవ్‌ డేస్‌ నమోదు కావచ్చని ఐఎండీ అంచనా వేసింది.

వేడిగాలుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. వాతావరణ కేంద్రంలో గరిష్ట ఉష్ణోగ్రత మైదానాల్లో కనీసం 40 డిగ్రీల సెల్సియస్‌, తీరప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ . కాగా కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుని, సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉన్నప్పుడు వేడి తరంగ పరిమితిని చేరుకుంటాయని చెబుతారు. 

వేసవికాలంలో, మైదానాలలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే ఎక్కువకు చేరుకున్నప్పుడు, గాలి చాలా వేడిగా మారుతుంది, దీని కారణంగా వడదెబ్బ ప్రమాదం ఉంటుంది. వేడి రోజులు ఎక్కువగా నమోదవుతాయంటే సీజన్‌ మొత్తం వేడి వాతావరణం ఉంటుందని అర్థం కాదని, ఆయా హీట్‌ వేవ్‌ డేస్‌లో మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్‌ రాయ్‌ చెప్పారు. 

అయితే 2024 కంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండనున్నాయా అన్న ప్రశ్నకు ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. 2024 సంవత్సరం భారతదేశ చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లోకి ఎక్కింది. గత ఏడాది దేశంలో 554 అత్యంత వేడి రోజులు నమోదయ్యాయి.

అదేవిధంగా ఈ వేసవిలో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటె తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. రాగల నాలుగైదు రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఎండల తీవ్రత పెరగనుందని, దేశ రాజధాని ఢిల్లీ దాని పరిసర రాష్ట్రాల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ఐఎండీ తెలిపింది.