రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!

రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!

ప్రయాగరాజ్ వెళ్లే ట్రైన్ ల పేర్లు దాదాపు ఒకేలా ఉండటమే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటకు దారితీసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ‘ప్రయాగ్రాజ్ ఎక్స్ ప్రెస్’, ‘ప్రయాగరాజ్ స్పెషల్’ ట్రైన్ ల పేర్లతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారని వెల్లడించారు. ఈ మేరకు చేసిన అనౌన్స్మెంట్ తో తమ రైలు అనుకుని ప్రయాణికులు వేరే ప్లాట్ ఫామ్ వద్దకు దుసుకెళ్లారని చెప్పారు. 

అంతేకాకుండా కొన్ని రైళ్లు ఆలస్యం కావడం కూడా ఈ ఘటన జరగడానికి కారణమని వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ రైల్వే స్టేషన్లోని 16వ ప్లాట్ ఫామ్ వద్దకు ‘ప్రయాగ్రాజ్ స్పెషల్’ రైలు వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చింది. అదే సమయంలో ‘ప్రయాగరాజ్ ఎక్స్ ప్రెస్’ కోసం 14వ ప్లాట్ఫామ్పై వేచి చూస్తున్న ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. 

14వ ప్లాట్ ఫామ్ కు బదులు తమ ట్రైన్ 16వ ప్లాట్ ఫామ్ పైకి వస్తుందనుకుని అటువైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఒక్కసారిగా జనం గుమిగూడారు. వంతెనపై నుంచి దిగుతున్న క్రమంలో మెట్లపై స్లిప్ అయి ఒకరిపై ఒకరు పడిపోయారు. ఫలితంగా తొక్కిసలాటకు దారితీసింది.  ప్రతి గంటకు 1,500 సాధారణ టిక్కెట్లను రైల్వే విక్రయించిందని, ఫలితంగా స్టేషన్ మరింత రద్దీగా మారిందని ఉత్తర్ రైల్వే సీపీఆర్ఓ హిమాన్షు ఉపాధ్యాయ తెలిపారు.  ట్రైన్ల పేర్లకు తోడు, ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన 4 రైళ్లలో మూడు ఆలస్యం అయ్యాయి. దీంతో స్టేషన్లో అనూహ్యంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 

తొక్కిసలాట జరిగిన సమయంలో ప్లాట్‌ఫామ్ 14 వద్ద ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్, ప్లాట్‌ఫామ్ 12 వద్ద మగధ్ ఎక్స్‌ప్రెస్, ప్లాట్‌ఫామ్ 13 వద్ద స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, ప్లాట్‌ఫారమ్ 15 వద్ద భువనేశ్వర్ రాజధాని ఉన్నాయి. పైగా, 25 అడుగుల వెడల్పు గల ఫుట్ ఓవర్‌బ్రిడ్జిపైకి వెళ్లే 42 మెట్లు ఉన్న ఇరుకైన మెట్లమార్గం భీతాహ, సంక్షుభిత పరిస్థితికి దారి తీసింది.

తొక్కిసలాట నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆదివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మరో 6 కంపెనీల బలగాలను సిద్ధంగా ఉంచారు. ఆదివారం నుండి ప్లేట్ ఫారం టికెట్ల అమ్మకాన్ని నిలిపివేశారు.

ఈ ఘటనపై ఇద్దరు సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ నర్సింగ్ డియో, నార్తర్న్ రైల్వే ప్రన్సిపల్ చీఫ్ సేఫ్టీ కమిషనర్ పంకజ్ గంగ్వార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దర్యాప్తులో భాగంగా రైల్వే స్టేషన్లోని అన్ని వీడియో ఫుటేజీలను భద్రపరచాలని కమిటీ ఆదేశించింది.

14, 15 ప్లాట్ఫామ్లలో ప్రయాణికుల చెప్పులు, వస్తువులు, దుస్తులు, ఆహారం ప్యాకెట్లు చెల్లచెదురుగా పడి ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున రైల్వే స్టాఫ్ రంగంలోకి దిగారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రాత్రంగా శ్రమించి వాటిని తొలగించారు.  కాగా, మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయిలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. మిగిత భక్తులను 4 ప్రత్వేక రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చారు రైల్వే అధికారులు.