బీజేపీదే విజయమంటున్న ఎగ్జిట్ పోల్స్!

బీజేపీదే విజయమంటున్న ఎగ్జిట్ పోల్స్!
 
ఢిల్లీ పీఠం కమలానిదేనని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి. హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించబోతోందని సర్వే సంస్థలు ప్రకటించాయి. ప్రధాన సర్వే సంస్థలన్నీ బీజేపీకి జై కొట్టగా, కేకే, వీ ప్రిసైడ్‌ సర్వే సంస్థలు ఆప్‌ మరోసారి గెలుస్తుందని తేల్చాయి. కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరిచే అవకాశం కష్టమేనని తెలిపాయి. 
 
ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మొదటి నుంచే పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్లింది. ఫలితంగా 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి.  రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న బిజెపి ఆమ్‌ఆద్మీకి గట్టి పోటీ ఇచ్చింది. 
 
మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు ఆప్‌ కూడా తీవ్రంగా శ్రమించింది. కాంగ్రెస్‌ ప్రభావం మాత్రం పెద్దగా కనిపించలేదు. మొత్తంగా ఆప్‌, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ చాలావరకు అంచనా వేశాయి.  పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీకి ఈసారి ఓటమి తప్పదని చాలావరకు సర్వేలు అంచనా వేశాయి. 
 
మొత్తం 70 స్థానాలకుగాను, బీజేపీ కూటమికి 51 నుంచి 60 సీట్లు వస్తాయని పీపుల్స్‌ పల్స్‌ పేర్కొంది. ఆమ్‌ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్‌సైట్‌ సర్వే ప్రకారం బీజేపీ కూటమి 40 నుంచి 44 స్థానాల్లోనూ, ఆమ్‌ఆద్మీ 25 నుంచి 29 స్థానాలు, కాంగ్రెస్ గరిష్ఠంగా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని తేలింది.

టైమ్స్‌ నౌ అంచనా ప్రకారం బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్‌ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ సున్నా లేదా రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. పీ-మార్క్‌ సర్వే ప్రకారం బీజేపీ కూటమి 39 నుంచి 49 స్థానాల్లోనూ, ఆమ్‌ఆద్మీ 21 నుంచి 31 సీట్లు, కాంగ్రెస్ సున్నా నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. పోల్‌ డైరీ సర్వే ప్రకారం బీజేపీ కూటమికి 42 నుంచి 50, ఆప్‌నకు 18 నుంచి 25, కాంగ్రెస్‌ సున్నా నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.

చాణక్య స్ట్రాటర్జీస్‌ బీజేపీ కూటమి 39 నుంచి 44 స్థానాల్లోనూ, ఆప్‌ 25 నుంచి 28 స్థానాలు., కాంగ్రెస్ 2 నుంచి 3 చోట్ల విజయం స్థాదిస్తుందని పేర్కొంది. జేపీసీ పోల్ బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆప్‌నకు 22 నుంచి 31, కాంగ్రెస్‌కు సున్నా నుంచి 2, ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.

బీజేపీ, ఆప్‌ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. బీజేపీ కూటమికి 35 నుంచి 40, ఆప్‌నకు 32 నుంచి 37, కాంగ్రెస్‌ గరిష్ఠంగా ఒక స్థానం గెలుస్తాయని తెలిపింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కేకే సర్వే అంచనా వేసింది. 

ఆప్‌ 44, బీజేపీ కూటమి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. మైండ్‌ బ్రింక్ కూడా ఆప్‌నకు 44 నుంచి 49, బీజేపీ కూటమికి 21 నుంచి 25, కాంగ్రెస్‌కు సున్నా లేదా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. దిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈనెల 8న వెల్లడి కానున్నాయి.

కాగా, 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ సారి మాజీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కు చెందిన సందీప్‌ దీక్షిత్‌, బీజేపీకి చెందిన ప్రవేశ్‌ వర్మ సైతం ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ఢిల్లీ సీఎం అతిషి మర్లేనా కల్కాజీ స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి బీజేపీ నుంచి రమేశ్‌ బిధురి పోటీ చేస్తున్నారు.