
బిసి కుల గణన నివేదిక ప్రవేశపెట్టడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరిపితే, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా బిసిలకు 42 శాతం రేజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం ప్రవేశ పెడతారని, దానికి చట్టబద్దత కల్పించడం కోసం కేంద్రంకు పంపుతారని అందరూ భావించారు. అయితే తాము తెలంగాణలో చేసిన వి ధంగా దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ, కుల సర్వే ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని చేయడంకు పరిమితం అయ్యారు.
కేంద్రం చట్టబద్దత కల్పిస్తేనే తాము ఈ రేజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతూ తాము పార్టీ పరంగా 42 శాతం సీట్లు బిసిలకు ఇస్తామని, బిఆర్ఎస్, బిజెపి కూడా ఆ విధంగా ఇస్తాయా? అంటూ రాజకీయ ప్రసంగంకు పరిమితం అయ్యారు.
దేశవ్యాప్తంగా కుల గణన కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అంతకు ముందు రోజే లోక్ సభలో తెలంగాణ కుల సర్వేను ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే, ఈ సర్వే రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు 46% ఉన్నాయని వెల్లడించడంతో, అది ఇప్పుడు కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్లు పెరుగుతుండటంతో, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
రాహుల్ గాంధీ నినాదం “జిత్నీ ఆబాది, ఉత్నా హక్” (జనాభా మేరకు హక్కులు) ప్రకారం, బిసి హిందువులు, ముస్లింలు కలిపి 48 శాతం ఉన్నారని తెలంగాణ సర్వే వెల్లడించింది. ఈ గణాంకాల నేపథ్యంలో, రాబోయే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు డిమాండ్ పెరుగుతోంది. మరోవంక ఈ సర్వ్ గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సర్వే కన్నా తక్కువగా బిసి జనాభాను చూపడం పట్ల బిఆర్ఎస్, బిజెపిలతో పాటు బిసి సంఘాలు తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నాయి.
సర్వేలో బీసీల జనాభా తగ్గిందని, కులగణనలో పలు తప్పులు జరిగాయని, సమగ్రంగా సర్వే జరగలేదని ఆదిలాబాద్ బిజెపి ఎమ్యెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన సర్వేపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయని చెబుతూ 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కలతో పోల్చిచూస్తే ప్రస్తుత సర్వేలో బీసీ జనాభా తగ్గిందని విస్మయం వ్యక్తం చేశారు.
లోక్సభలో రాహుల్ గాంధీ కులగణనపై అద్భుతంగా మాట్లాడారని, ఆయన వ్యాఖ్యలు విని ఎంతో సంతోషించానని పాయల్ శంకర్ తెలిపారు. రాహుల్ వ్యాఖ్యలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు పొంతన లేదని ధ్వజమెత్తారు. తన ఇంటికి సర్వేకు సంబంధించి రెండు స్టిక్కర్లు అంటించారని, సర్వేలో అనేక తప్పులు జరిగాయని, సమగ్రంగా జరగలేదని, పూర్తిస్థాయిలో ప్రజలు కులగణనలో పాల్గొనలేదని పాయల్ శంకర్ స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనేక గృహాలను కుల సర్వేలో చేర్చలేదని బీసీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణలో మాత్రమే కాదు, పొరుగున ఉన్న కర్ణాటకలో కూడా కాంగ్రెస్ కుల గణన విషయంలో ఇబ్బంది పడుతోంది. 2018లో సిద్ధరామయ్య ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే నివేదికను బహిరంగంగా ప్రకటించాలా వద్దా అనే అంశంపై కాంగ్రెస్లో విభేదాలు నెలకొన్నాయి.
జనవరిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కొంతమంది అగ్రకుల మంత్రులు ఈ నివేదికను నిలిపివేయాలని కాంగ్రెస్ హైకమాండ్ను ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది. సుమారు రూ. 160 కోట్లు వ్యయంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రారంభించిన ఈ సర్వేను 2024లో ప్రజలకు విడుదల చేయాల్సి ఉంది.
అయితే, చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకోవడంతో నివేదిక విడుదల నిలిచిపోయింది. ఈ పరిణామం కాంగ్రెస్లో విభజన స్పష్టంగా చూపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ కుల గణనను దేశవ్యాప్త “ఎక్స్-రే”గా అభివర్ణించినప్పటికీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ అంశం కాంగ్రెస్ను సంక్షోభంలోకి నెట్టడం కనిపిస్తున్నది.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!