నియోజకవర్గాల పునర్విభజనకు డీఎంకే మద్దతు?

నియోజకవర్గాల పునర్విభజనకు డీఎంకే మద్దతు?
 
‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు’ విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందనడానికి సంకేతంగా, ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) లోక్‌సభ సభ్యురాలు కనిమొళి కరుణానిధి గురువారం ఒక కీలక సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసి, సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఈ ‘టీ మీట్’ (అనధికారిక సమావేశం)ను ఏర్పాటు చేశారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి, ఎన్డీయే సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో, ప్రతిపక్షం నుండి పాల్గొన్న ఏకైక నాయకురాలు కనిమొళి మాత్రమే కావడం గమనార్హం. కాంగ్రెస్ లేదా ఇతర ప్రతిపక్ష నాయకులు దూరంగా ఉన్నప్పటికీ, కనిమొళి ఈ సంప్రదాయ టీ మీట్‌కు హాజరుకావడం చర్చనీయాంశమైంది. 
 
ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో లోక్‌సభ ఆమోదం పొందలేకపోయిన ఈ పునర్విభజన బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోందా? అనే సందేహాలను ఇది మరోసారి రేకెత్తించింది. ఏప్రిల్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు డీఎంకే దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే)తో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పరిస్థితులను మార్చివేసింది.
 
దీంతో ఈ  చట్టంపై డీఎంకే తన వైఖరిని కొంత సడలించింది. రాజకీయాల్లో “ఎవరినీ శాశ్వత మిత్రులుగా లేదా శత్రువులుగా పరిగణించలేము” అని పార్టీ అధికార ప్రతినిధి కనిమొళి సోము ఇటీవల పేర్కొనడంతో, ఎండిఎ ఎన్డీయేలో చేరవచ్చనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. పునర్విభజన తర్వాత తమిళనాడుకు లోక్‌సభలో న్యాయమైన వాటా దక్కేలా చూడాలని తన పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉందని ఆమె స్పష్టం చేశారు. 
 
పునర్విభజన బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు డీఎంకే మూడు షరతులను విధించిందని ‘ఇండియా టీవీ‘కి చెందిన వర్గాలు గతంలో వెల్లడించాయి. మొదటిది, 1971 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల సంఖ్యపై విధించిన ‘స్తంభన’ 2027లో ముగియనుంది. ఈ గడువును రాజ్యాంగ సవరణ ద్వారా మరో 25 ఏళ్లపాటు పొడిగించాలని డీఎంకే కోరుకుంటోందని ఆ వర్గాలు తెలిపాయి. 
 
రెండవ డిమాండ్ ప్రకారం, అన్ని రాష్ట్రాలకు లోక్‌సభ సీట్ల సంఖ్యలో 50 శాతం మేర ఏకరీతి పెంపుదల ఉండాలని డీఎంకే పేర్కొంది. ఇక మూడవ డిమాండ్ విషయానికొస్తే, కొత్త చట్టంతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సవరించిన లోక్‌సభ నియోజకవర్గాల పూర్తి జాబితాను కేంద్రం విడుదల చేయాలని అందులో పేర్కొన్నారు. 
 
ఈ మూడు షరతులను అంగీకరిస్తే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు డీఎంకే సిద్ధంగా ఉందని సమాచారం. అయితే, పార్టీ అగ్రనేతలు అందరితో సంప్రదించిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. డీఎంకేకు 22 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఆ పార్టీ మద్దతు లభిస్తే ఎన్డీయే బలం 341కి పెరుగుతుంది. 
 
అయితే, లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ కోసం అధికార కూటమికి 360 ఓట్లు అవసరమవుతాయి. దీని కోసం ఎన్డీయే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చెందిన  చెందిన నలుగురు ఎంపీలు, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్ పీఎం)కు చెందిన ఒక సభ్యుడు, ఎన్‌సీపీకి చెందిన ఎనిమిది మంది ప్రజాప్రతినిధులపై ఆధారపడవచ్చు.