కేటీఆర్‌కు 16న విచారణకై మరోసారి ఈడీ నోటీసులు

కేటీఆర్‌కు 16న విచారణకై మరోసారి ఈడీ నోటీసులు

* సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్‌

ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్​ను కొట్టివేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న కేసులో విచారణకు రావాలని కేటీఆర్​కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్​ను మంగళవారం విచారణ కోసం రావాలని ఈడీ గతంలోనే కోరింది. అయితే తన క్వాష్ పిటిషన్​పై ఇవాళ తుది తీర్పు వస్తోందని, తనకు ఈరోజు కాకుండా మరింత సమయం కావాలని ఆయన ఈడీ ఈ-మెయిల్ ద్వారా లేఖను పంపారు. దీనికి ఈడీ అధికారులు కూడా సమ్మతించారు. 

అయితే ఈరోజు హైకోర్టులో కేటీఆర్​కు తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. అటు ఏసీబీ కూడా ఈనెల 9న విచారణను రావాలని కేటీఆర్​కు సోమవారం మరోసారి నోటీసులు జారీచేసింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై కేటీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. 

ఈ కేసులో ముందుగానే కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్‌ వేస్తే తమ వాదనలూ వినాలని ప్రభుత్వం అందులో కోరింది.  దానితో ఒకవేళ కేటీఆర్ ముందస్తు బెయిల్ కోసమైనా, లేకపోతే హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళితే, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాతే సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీ చేయనుంది.

తాజా పరిణామాలపై ‘ఎక్స్‌’లో కేటీఆర్‌ స్పందించారు. “నా మాటలు రాసిపెట్టుకోండి. ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. ఈ అబద్ధాలు నన్ను దెబ్బతీయలేవు. ఈ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయి. నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందనేది నా అచంచల విశ్వాసం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. నా పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుంది” అని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.