ప్రార్థనా స్థలాల వద్ద సర్వేలు నిలిపివేయాలని, ఆ స్థలాలపై కొత్త కేసులను స్వీకరించరాదు అని దేశంలోని ట్రయల్ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన ప్రదేశాలకు సంబంధించిన వ్యాజ్యాలను స్వీకరించరాదని, వాటిపై ఆదేశాలు జారీ చేయరాదని దిగువ కోర్టులకు సూచించింది. ప్రార్థనా స్థలాల చట్టం-1991కి సంబంధించి అనుకూలంగా, ప్రతికూలంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంపై గురువారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. 1991 ప్రార్థనా స్థలాల చట్టం ఏదైనా ప్రార్థనా స్థలాన్ని మార్చటాన్ని నిషేధిస్తుంది. అయితే 1947 ఆగస్టు 15న ఉన్న ఏ ప్రార్థనా స్థలం ఏదైనా అలాగే కొనసాగేందుకు అనుమతిస్తుంది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కొత్తగా ఎలాంటి వ్యాజ్యాలు స్వీకరించరాదని, పెండింగ్ కేసులకు సంబంధించి మధ్యంతర లేదా తుది ఉత్తర్వులు ఇవ్వరాదని దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రార్థనా స్థలాల చట్టం 1991ని పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. విచారణ చేయకుండా ఆదేశాలు జారీ చేయరాదంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులను హిందువుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. సుప్రీం ఇచ్చిన తాజా ఆదేశాలను హిందువుల తరపున వాదిస్తున్న అనేక మంది లాయర్లు వ్యతిరేకించారు. తమ వాదనలు వినకుండా ఆదేశాలు ఇవ్వొద్దు అని కోరారు.
ప్రార్థనా స్థలాల చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలకు సంబంధించి 4 వారాల్లో తన ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్రం ప్రతిస్పందన తర్వాత ఇతర పార్టీలు రీజాయిండర్ దాఖలు చేయటానికి మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఈ విషయంపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రార్థనా స్థలాల చట్టంలోని 2,3, 4 సెక్షన్లను తొలగించాలని అశ్విని ఉపాధ్యాయ కోరారు. మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసు తమ వద్ద పెండింగ్లో ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
More Stories
జమిలీ ఎన్నికలపై 31న జేపీసీ రెండో సమావేశం
బిజెపి ఎంపీలపై క్రిమినల్ కేసు కొట్టివేత
8 రోజుల్లో 9 కోట్ల మంది పుణ్యస్నానాలు