ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్​మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బస్తర్ రేంజ్​లో ఉన్న నాలుగు జిల్లాల(నారాయణపూర్, దంతెవాడ, జగదల్‌పుర్, కొండగావ్) బలగాలు భారీ కూంబింగ్‌ చేపట్టాయి. 

ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు ఎదురుపడ్డారు. అనంతరం పోలీసులపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. కూంబింగ్‌లో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.

సెర్చ్​ ఆపరేషన్​లో భాగంగా ఇప్పటివరకు యూనిఫాంలు ధరించిన ఏడుగురు గుర్తుతెలియని నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ పీ సుందర్​రాజ్ తెలిపారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది.

ఈ ఎన్​కౌంటర్​పై ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ స్పందించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్​లో ఏడుగురుని మావోయిస్టులను మట్టుబెట్టడంలో భద్రతా దళాలు విజయం సాధించాయని తెలిపారు. “ముందస్తు సమచారంతో ఈ రోజు ఈ చర్యలు తీసుకున్నాము. గత ఐదేళ్లలో 219 మంది నక్సలైట్లు చనిపోయారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు 220మంది నక్సలైట్లు మృతిచెందారు.” అని ఛత్తీస్​గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా డిసెంబర్ 15న బస్తర్​లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు దళం యాక్టివ్ అయ్యిందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై పోలీసులు, బస్తర్ రేంజ్​లోని నాలుగు జిల్లాల నుంచి దాదాపు వేయి మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. మావోయిస్టుల ఆచూకీ కోసం భారీ ఆపరేషన్ చేపట్టారు.