ఉగ్రవాదం, ఆన్లైన్ తీవ్రవాద భావజాల వ్యాప్తికి వ్యతిరేకంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న 114 తీవ్రవాద ప్రచురణలు, పత్రికలు,డిజిటల్ పత్రాలను స్వాధీనం చేసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన ఈ చర్య తీవ్రవాద ప్రచార వ్యాప్తిని అరికట్టడం, హింసను ప్రోత్సహిస్తుందని, ఉగ్రవాద బృందాలలో నియామకాలకు దారితీస్తుందని భావిస్తున్నారు.
మహారాష్ట్ర హోం శాఖ ఆగస్టు 6, 2026న ఈ అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. జాబితాలో ఉన్న ప్రచురణల అన్ని భౌతిక, డిజిటల్ కాపీలను స్వాధీనం చేసుకోవాలని ఈ నోటిఫికేషన్లో ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రకారం, ఇటువంటి కార్యకలాపాలను అరికట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, తీవ్రవాద సాహిత్యం , తీవ్రవాద డిజిటల్ కంటెంట్ ప్రసారం కొనసాగుతోందని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు, నిఘా సమాచారం, సైబర్ నిఘాలో వెల్లడైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రచురణలు హింసాత్మక తీవ్రవాదాన్ని కీర్తిస్తాయని, యువతలో తీవ్రవాద భావజాల వ్యాప్తిని ప్రోత్సహిస్తాయని, ఉగ్రవాద సంస్థలలో నియామకాలను ప్రోత్సహిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇటువంటి కంటెంట్ భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, జాతీయ భద్రతకు, ప్రజా శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని కూడా తెలిపింది.
ఈ ఉత్తర్వును ఉల్లంఘించినట్లు తేలిన వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ జాబితాలో పేర్కొన్న కొన్ని ప్రముఖ శీర్షికలలో వాయిస్ ఆఫ్ ఖురాసన్ మ్యాగజైన్, ది రివల్యూషనరీ రిసర్జెన్స్, కాశ్మీర్ కిఫా రెసిలెన్స్ & కరేజ్, ది సోల్ ఆఫ్ రెసిస్టెన్స్, నవాయ్ గజ్వా-ఎ-హింద్ ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం, ఈ ప్రచురణలలో తీవ్రవాద భావజాలం, ఉగ్రవాద ప్రచారంతో ముడిపడిన విషయాలు ఉన్నాయి.
కొత్త చట్టపరమైన నిబంధనలు తీవ్రవాద కంటెంట్ను ఎదుర్కోవడంలో రాష్ట్ర సామర్థ్యాన్ని బలోపేతం చేశాయని చెబుతూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వ చర్యను సమర్థించారు. “చూడండి, ఇంటర్నెట్, డార్క్ వెబ్లో ప్రజలను తీవ్రవాద భావజాలం వైపు మళ్లించే లేదా బాంబులు ఎలా తయారు చేయాలో వివరించే సమాచారంతో కూడిన కొన్ని ప్రచురణలు, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. దాడులు ఎలా నిర్వహించాలనే సమాచారం కూడా వాటిలో ఉంది” అని తెలిపారు.
భౌతిక లేదా డిజిటల్ రూపంలో ఉన్నప్పటికీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఎలాంటి కథనాలు, పోస్టులు లేదా పత్రాలను తమ వద్ద ఉంచుకోవద్దని, నిల్వ చేయవద్దని లేదా ప్రచారం చేయవద్దని ఏటీఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అటువంటి సమాచారం ఎవరికైనా కనిపిస్తే, వెంటనే దర్యాప్తు అధికారులకు తెలియజేయాలని కూడా ఆ సంస్థ పౌరులను కోరింది.

More Stories
అరుణాచల్లోని 27 ప్రదేశాలను చైనా పేర్లను తిప్పికొట్టిన భారత్
అగ్ని-4 బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
అస్సాం వరదల్లో 87కు పెరిగిన మృతుల సంఖ్య.. 11 రైళ్లు రద్దు