2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌స్టేషన్‌

2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌స్టేషన్‌
అంతరిక్షరంగంలో భారత్‌ చరిత్ర సృష్టిస్తున్నది. ఎప్పటికప్పుడు సరికొత్త విజయాలను సాధిస్తూ వస్తున్నది. తాజాగా కేంద్ర సెన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ కీలక ప్రకటన చేశారు. 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌ స్టేషన్‌ ఉంటుందని వెల్లడించారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోబోతున్నామని తెలిపారు. 

అలాగే, 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలుమోపుతారని చెప్పారు. ఫిబ్రవరి 27న తిరువనంతపురంలో గగన్‌యాన్ మిషన్‌ను సంబంధించిన వ్యోమగాముల పేర్లను ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌ స్టేషన్‌ ఉంటుందని చెప్పారు.

“చంద్రునిపై భారతీయ వ్యోమగామిని దింపాలనే ప్రణాళికలతో అంతరిక్ష పరిశోధనలో ప్రధాన మైలురాళ్లను సాధించడానికి సిద్ధంగా ఉంది. 2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకుంటుంది. అంతరిక్ష కేంద్రాలు కల్పిస్తున్న అమెరికా వంటి దేశాల సరసన త్వరలో భారత్ నిలవనుంది. ” అని జితేందర్ సింగ్ తెలిపారు.

ప్రస్తుతం రెండు దేశాలకు స్పేస్‌స్టేషన్స్‌ ఉన్నాయి. భారత్‌ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తే చారిత్రాత్మక విజయంతో పాటు సొంత స్పేస్‌స్టేషన్‌ ఉన్న మూడోదేశంగా నిలువనున్నది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ కోసం ప్రణాళికలు రూపొందించింది. 52 టన్నుల బీఏఎస్‌ తొలుత ముగ్గురు వ్యోమగాములు వెళ్లొచ్చు. 

భవిష్యత్‌లో దాని సామర్థ్యాన్ని ఆరుకి పెంచే యోచనలో ఉన్నది. బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌లో జరిగిన కన్నడ సాంకేతిక సదస్సులో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. బీఏఎస్‌ అనేది లైఫ్‌ సైన్సెస్‌, మెడిసిన్‌ రంగాల్లో శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇచ్చేందుకు, అంతరిక్ష పరిశోధనలను మెరుగుపరిచేందుకు భారత్‌ అభివృద్ధి చేస్తున్న మాడ్యులర్‌ స్పేస్‌ స్టేషన్‌. 

తొలి మాడ్యుల్‌ 2028లో ఎల్‌వీఎం3 వాహకనౌక ద్వారా ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత స్పేస్‌స్టేషన్‌ రూపుదిద్దుకుంటుంది. స్పేస్‌స్టేషన్‌ మూడ్యుల్స్‌ని పలు దశల్లో నింగిలోకి పంపి.. ఆ తర్వాత అంతరిక్షంలోనే వాటిని అనుసంధానిస్తారు. 2035 నాటికి స్పేస్‌స్టేషన్‌ పూర్తవుతుంది.

ప్రస్తుతం విశ్వంలో ఒకే స్పేస్‌స్టేషన్‌ ఉన్నది. దీన్ని నానా అనేక దేశాల సహకారంతో నిర్మించింది. ప్రస్తుతం చైనా సైతం సొంతంగా ఇంటర్‌నేషనల్‌ స్పేస్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నది. భారత్‌ సైతం బీఎస్‌ఏని నిర్మిస్తే మూడోదేశంగా నిలువనున్నది. ఈ స్టేషన్‌కు భారత అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు. ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల కోసం మైక్రోగ్రావిటీ, మానవ ఆరోగ్యం, లైఫ్‌ సస్టెయినింగ్‌ టెక్నాలజీస్‌పై అధ్యయనానికి అనుమతి ఇస్తుంది. అమెరికా, చైనా దేశాలు ఇప్పటికే తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో భారత్‌ పేరు సైతం చేరనున్నది. 

ఈ ప్రాజెక్ట్ లక్ష్యం యువ శాస్త్రవేత్తలను ప్రేరేపించడంతో పాటు అంతరిక్షరంగంలో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం. చంద్రయాన్‌-1తో చంద్రుడిపై తొలిసారిగా నీటిజాడలను గుర్తించింది. ఆ తర్వాత చంద్రయాన్‌-3తో దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా ఇస్రో నిలిచింది. భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ సైతం గర్వకారణంగా నిలువనున్నది. అదే సమయంలో అంతరిక్ష పరిశోధనల్లో భారత దేశ స్థానాన్ని సుస్థిరం చేయనున్నది.

భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్‌ సముద్రయాన్‌లో భాగంగా మత్స్య-6000 జలాంతర్గామిని రూపొందిస్తున్నట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని సముద్రంలో 6 కి.మీ గరిష్ఠ లోతు వరకు చేరుకోవచ్చని, దీని వల్ల సముద్ర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయొచ్చని తెలిపారు. సముద్రగర్భ అన్వేషణలో తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి ఇదేనని చెప్పారు.
 
ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఉపగ్రహ ప్రయోగాల్లో భారత్‌ గణనీయమైన పురోగతిని సాధించిందని జితేంద్రసింగ్‌ తెలిపారు. ఇప్పటి వరకు భారతదేశం శ్రీహరికోట నుంచి 432 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని, వాటిలో 90 శాతం అంటే 397 ఉపగ్రహాలను గత దశాబ్దంలోనే ప్రయోగించామని పేర్కొన్నారు. గత పదేళ్లలో ఐరోపా ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపడం ద్వారా భారత్‌ 260 మిలియన్‌ యూరోలను ఆర్జించిందని తెలిపారు.