విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి శ్రేణులు

విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి శ్రేణులు
నీట్‌ పరీక్ష అంశంపై ప్రారంభమైన ఢిల్లీ నిరసనలు దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌ ఆరోపించారు.  పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీగా బయలు దేరి ప్లే కార్డ్ లు ప్రదర్శిస్తూ ఏలూరు రోడ్డు లో నినాదాలు చేస్తూ హోరెత్తించారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకోగానే కాంగ్రెస్ కు చెందిన కొందరు కర్రలతో దాడి కి పాల్పడ్డారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం కాంగ్రెస్ దాడి ని అడ్డుకున్నారు. ర్యాలీ ని అడ్డుకునే ప్రయత్నం లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ పై ఎస్సై భౌతిక దాడి కి ప్రయత్నం చేశారు. చైతన్య శర్మ తదితరులు పై కాంగ్రెస్ గూండాలు దాడి కి ప్రయత్నం చేసాయి .
 
నిరసన ర్యాలీ లో మాధవ్ మీడియా తో మాట్లాడుతూ దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తోందని విమర్శించారు.
ఢిల్లీలో సోనమ్‌ వాంగ్చుక్‌ చేపట్టిన నిరసనల్లో అర్బన్‌ నక్సల్స్‌, దేశ విద్రోహ శక్తులు చొరబడ్డాయని మాధవ్‌ ఆరోపించారు. 
ఆర్టికల్‌–370 రద్దును వ్యతిరేకించడం, పార్లమెంట్‌ దాడి కేసు నిందితుడు అఫ్జల్‌ గురు ఉరితీతను ప్రశ్నించడం, దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేసే శక్తులకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు అండగా నిలవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై దాడి యత్నం దేశంపైనే జరిగిన దాడిగా భావిస్తున్నామని మాధవ్‌ పేర్కొన్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యాలయాల ముట్టడికి బీజేపీ పిలుపు ఇచ్చిన్నట్లు తెలిపారు. విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్‌ శ్రేణులు గుడ్లతో, కర్రలతో దాడి చేయడం వారి హింసాత్మక రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.

మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వ హయాంలో 150కు పైగా పేపర్‌ లీకులు జరిగిన విషయాన్ని కాంగ్రెస్‌ మరచిపోయిందని విమర్శించారు. నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ ఘటన వెలుగులోకి రాగానే బాధ్యులపై మోదీ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని అరెస్టులు చేసిందన్నారు. పరీక్షల నిర్వహణ పూర్తై, ర్యాంకు కార్డులు జారీ చేసి కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు.

రాహుల్‌ గాంధీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మాధవ్‌ ఆరోపించారు. దేశద్రోహ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశ సమైక్యత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

రాష్ట్ర కార్యదర్శులు భోగి రెడ్డి ఆదిలక్ష్మి, బొడ్డు నాగలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధిలు ముళ్ళపూడి రేణుక, షేక్ బాజీ, చిరువోలు బుచ్చి రాజు,  బిజెపి రాష్ట్ర కార్యాలయం ఇంఛార్జి ఉప్పలపాటి శ్రీనివాసరాజు , కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.