బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌ పీఎస్‌లో విధులకు ఆటంకం కలిగించారంటూ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో గురువారం ఉదయం కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు చేరుకుని ఆయనను అరెస్ట్‌ చేశారు. అనంతరం అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.

అంతకు ముందు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి ప్రవేశించేందుకు హరీశ్‌రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. 

హరీశ్‌రావును తరలిస్తున్న వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్​వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు, కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు.

రాష్ట్రంలో నేటితో ప్రజాస్వామ్యం మరణించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్​రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించినందుకు తనను అరెస్టు చేశారని ఎక్స్ వేదికగా స్ఫందించన హరీశ్ రావు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా లేక ఎమ్మర్జెన్సీనా అంటూ ప్రశ్నించారు. తన ఫోన్ ట్యాపింగ్​కి గురైందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పైనే తిరిగి కేసులు పెట్టి అరెస్టు చేశారంటూ మండిపడ్డారు.