అరెస్ట్ కు ఈసీ ఆదేశంతో ఎమ్యెల్యే పిన్నెల అరెస్ట్

ఏపీలో ఈవీఎం విధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇస్నాపూర్‌ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు. 
 
ఇస్నాపూర్‌ లోకేషన్‌ గురించి పటాన్‌చెరు పోలీసులను అడిగిన ఏపీ పోలీసులు ఇస్నాపూర్‌ వరకు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకొని పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్‌ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏపీ పోలీసులు బుధవారం ఉదయం నుండి పలు బృందాలుగా వెతుకుతున్నారు.

ఈవీఏం ధ్వంసం కేసు వెలుగులోకి రాగానే పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ పారిపోయినట్లు వార్తలు రావడంతో వారిని అరెస్ట్ చేయడనికి ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి.  పిన్నెల్లి తెలంగాణలోని సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్నారు. పిన్నెల్లి కాన్వాయ్‌ను పల్నాడు పోలీసులు వెంబడించారు. పోలీసుల కళ్లుగప్పి పిన్నెల్లి మరో కారులో పరారయ్యారు. ఎట్టకేలకు ఇస్నాపూర్‌ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

పోలింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ బూత్​లోకి దూసుకెళ్లారు. ఈవీఎంను నేలకేసికొట్టి ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ ఈ ఘటనలో ఇప్పటి వరకూ పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. 
 
ఈ ఘటనకు సంబంధించి సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకుకి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా పోలీసులను తప్పించుకొని వెళ్లిన
పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. 
 
ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు, పీడీ పీపీ చట్టం కింద మరో కేసు నమోదు, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు నమోదు చేశారు. ఈనెల 20నే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు సీఈవో మీనా తెలిపారు. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ గుర్తించిందని చెప్పారు. ఘటన జరిగిన మరుసటిరోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని తెలిపారు. నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు. 
 
పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని, ఏడేళ్ల వరకూ శిక్షలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని చెప్పారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.