మిల్లర్ల నుండి ఉత్తమ్ రూ 500 కోట్లు వసూలు!

మిల్లర్ల నుండి ఉత్తమ్ రూ 500 కోట్లు వసూలు!
* యూ ట్యాక్స్‌ పేరుతో జరిగిన చెల్లింపుల్లో రూ 100 కోట్లు ఢిల్లీకి 
 
రాష్ట్రంలో రైతుల నుంచి తాలు, తరుగు, తేమ పేరిట ఎక్కువ ధాన్యం తూకం వేసిన మిల్లర్లు యూ ట్యాక్స్‌ పేరుతో మంత్రికి, అధికారులకు చెల్లింపులు చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన ఆరోపణ చేశారు.  ధాన్యం కొనుగోలులో క్వింటాకు 10-12 కిలోల చొప్పున ఎక్కువ తూకం వేస్తున్నారని, ఈ ప్రక్రియలో వసూలవుతున్న రూ.వందల కోట్లు ఎవరి ఖాతాలోకి వెళుతున్నాయో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కమిషనర్‌ చౌహాన్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
 
ఈ వ్యవహారంలో ఇటీవల రూ.500 కోట్లు చేతులు మారితే, అందులో రూ.100 కోట్లు ఎన్నికల నిధి పేరిట ఢిల్లీకి పంపించిన మాట వాస్తవం కాదా? అని ఉత్తమ్‌ను నిలదీశారు. సీఎం రేసులో తాను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఈ మొత్తాన్ని ఢిల్లీకి పంపించారని ఆరోపించారు. 
 
ధాన్యాన్ని ఎక్కువ తూకం వేయడంతో పాటు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ఇవ్వని మిల్లర్ల నుంచి అనధికారిక జరిమానా పేరిట రాష్ట్రంలో రూ.950 కోట్ల కుంభకోణం జరిగిందని బిజెపి నేత ఆరోపించారు. డీఫాల్టర్‌ మిల్లర్లకు సీఎంఆర్‌ కోటా ఎలా ఇచ్చారో కమిషనర్‌ చౌహాన్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రూ.వేల కోట్ల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నా.. మళ్లీ వారికే ధాన్యం ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి సీఎంఆర్‌ ద్వారా రావాల్సిన బియ్యం విలువ సుమారు రూ.25 వేల కోట్లు అని, మిల్లర్ల వద్ద ఉన్న ఈ ధాన్యానికి ప్రభుత్వం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి కొనసాగుతోందని ఆయన దుయ్యబట్టారు. గడచిన మూడేళ్లుగా ధాన్యం సేకరించి, సీఎంఆర్‌ ఇవ్వని మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని బిజెపి నేత నిలదీశారు. ఇలాంటి మిల్లర్లపై రూ.450 కోట్లు రశీదు లేని జరిమానా విధించారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి  కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నట్లు తెలుస్తోందని, ఇందులో 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి అధికంగా క్వాంటా చేస్తున్నారని ఆయన తెలిపారు. రైతుల నుంచి అధికంగా కొల్లగొడుతున్న రూ. 1600 కోట్ల విలువైన ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తోంది? అని ప్రశ్నించారు.
 
రైతులకు డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లకు సంబంధించిన డేటా ఉందా? డిఫాల్టర్ల వివరాలు ఉన్నాయా? లేవా? స్పష్టం చేయాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.