పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే

పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
 
* అడ్డంగా సీసీ కెమెరాల్లో రికార్డ్.. పరారీలో  పిన్నెల్లి 
 
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయిగేట్ 202 పోలింగ్ బూత్ లోకి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేరుగా ఈవీఎం వద్దకు వెళ్లి మిషన్ ను నేలకేసికొట్టారు. 
 
అనంతరం వీవీ ప్యాట్ మిషన్ కూడా ధ్వంసం చేశారు. అక్కడున్న ఏజెంట్ ఎమ్మెల్యేను నిలువరించేందుకు ప్రయత్నించాడు. అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి అతడిని బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు పోలింగ్ బూత్ లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 
సీసీ కెమెరాలో దృశ్యాలు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై ఇప్పటి వరకు స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పోలింగ్ రోజు పల్నాడు జిల్లా మాచర్లలో పెద్ద ఎత్తున చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గాలు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. 
 
ఘర్షణల నేపథ్యంలో పోలింగ్ రోజు సాయంత్రం ఎమ్మెల్యే పిన్నెల్లిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాచర్ల అల్లర్లపై సిట్ విచారణ ప్రారంభం కావడంతో గన్ మన్ లకు కూడా తెలియకుండా ఇంటి వెనుకవైపు నుండి ఎమ్మెల్యే పిన్నెల్లి ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తాను ఎక్కడికి వెళ్లలేదని, హైదరాబాద్ లో ఉన్నానని ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 
 
పోలింగ్ జరిగి తొమ్మిది రోజులు అవుతున్న ఇప్పటివరకు వెలుగులు వెలుగులోకి రాని రికార్డ్ అయిన వీడియో అకస్మాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమై హల్చల్ చేస్తుంది. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంల ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.  ఈ ఘటనపై టీడీపీ స్పందిస్తూ ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క మారణహోమం చేసి, ఏం తెలియనట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశం దాటి పోతే, ఎమ్మెల్యేలు రాష్ట్రం దాటి పారిపోయారని మండిపడింది. 

ప్రజలు తమకు ఓట్లు వేయటం లేదని, జగన్ చేయని పాపం లేదని ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రతి ఒక్కరూ జూన్ 4 తరువాత చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదని టీడీపీ హెచ్చరించింది. పోలింగ్ రోజునే ఓటమి భయంతో వైసీపీ ఎమ్మెల్యేల దారుణాలకు పాల్పడ్డారని విమర్శించింది.

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హింసను ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. పల్నాడు జిల్లాలో హింస గురించి ముందుగానే ఈసీని అప్రమత్తం చేశామని, అయితే ఈసీ కేవలం సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉందని విమర్శించారు.  పోలింగ్ తర్వాత దాడులు చేస్తామని పిన్నెల్లి ముందే హెచ్చరించారని గుర్తు చేశారు. పిన్నెల్లి వ్యాఖ్యలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.