ఏపీలో పోలింగ్ ముగిసినా పలుచోట్ల హింసాత్మక ఘటనలు

ఏపీలో పోలింగ్ ముగిసినా పలుచోట్ల హింసాత్మక ఘటనలు
* తిరుపతిలో విధ్వంసం- పల్నాడు, తాడిపత్రిలో రాళ్లదాడులు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిసినా రాజకీయ వేడి చల్లారలేదు. పలు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్ళ దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం  పోలింగ్‌ సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. 

తిరుపతిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. తిరుపతిలో ఈవీఎం స్ట్రాంగ్ రూంలను పరిశీలించేందుకు వచ్చిన ఆయనపై రాళ్ల దాడి చేశారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది. రాళ్ల దాడిలో పులివర్తి నానికి, ఆయన డ్రైవర్ గాయపడినట్లు తెలుస్తోంది. నాని సతీమణి పులివర్తి సుధారెడ్డిపై కూడా కొందరు దాడికి పాల్పడ్డారు. 

తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్ట్రాంగ్ రూమ్ లలోని ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పులివర్తి నాని అక్కడకు వచ్చాయని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఈ సమయంలో అక్కడ వైసీపీ కార్యకర్తలు భారీగా ఉండటంతో వారు నానిపై దాడికి పాల్పడ్డారు.

పులివర్తి నానిపై దాడితో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు పద్మావతి మహిళా వర్సిటీ వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసుల వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. అయితే దాడికి పాల్పడిన వారిపై కాకుండా తమపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారని టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసిపి ఎమ్యెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో వారు నిరసనకు దిగారు. సీఐ రామచంద్రారెడ్డి తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు.

ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఓటమికి భయపడిన పిరికిపందలే దాడులకు పాల్పడుతున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ కార్యకర్తలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది? అని ప్రశ్నించారు.

మరోవంక, తాడిపత్రిలో కూడా ఉద్రికత్త నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్ల దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో సీఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి. సోమవారం టీడీపీ నేత సూర్యముని ఇంటిపై దాడికి నిరసనగా మంగళవారం  పోలీస్ స్టేషన్ వద్ద జేసీ ప్రభాకర్ నిరసనకు దిగారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైపు వెళ్తుండగా అక్కడికి వైసీపీ కార్యకర్తలు భారీగా చేసుకున్నారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. సోమవారం టీడీపీ, వైసీపీ శ్రేణులు నాటు బాంబులు, పెట్రోల్‌ బాంబులతో దాడులు చేసుకున్నారు. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేశుని పాడులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. కారంపూడిలో టీడీపీ ఆఫీస్ కు వైసీపీ మద్దతుదారులు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.