కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా జగన్ ను అడ్డుకోండి!

ఏపీలో పోలింగ్ ముగియడంతో వైసీపీ ప్రభుత్వం తిరిగి రాదన్న అంచనాలతో రాష్ట్రంలో తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు చేసేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై  గవర్నర్  అబ్దుల్ నజీర్‌కు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు.
 
అపధర్మ(వైసీపీ) ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను విడుదల చేసేందుకు సిద్ధమైందని.. ఈ బిల్లులను తక్షణమే నిలిపివేయాలని లేఖలో చంద్రబాబు తెలిపారు. లబ్ధిదారులకు చెందాల్సిన నిధులను జగన్ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
 
సిఎం జగన్ ప్రభుత్వం చివరి నిముషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని…దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖలో కోరారు. పథకాల లబ్దిదారులకు చెందాల్సిన నిధులను జగన్ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని లేఖలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకుసిద్ధమైందని, నిబంధనలకు విరుద్దంగా ఈ బిల్లుల విడుదల జరగబోతోందని బాబు తెలిపారు.

కొద్దిరోజుల క్రితం ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకు, పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని, ఎన్నికల కోడ్ కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని చంద్రబాబు గుర్తుచేశారు.

రోజువారీ అప్పులపైనే ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని, ప్రభుత్వ నిర్వహణ కోసం రిజర్వ్ బ్యాంకు, ఇతర బ్యాంకుల నుండి తరచూ ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లిందని చంద్రబాబు లేఖలో తెలిపారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్ మెంట్ వంటి వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. ఆరోగ్య శ్రీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపేస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్తున్నాయన్నారు.

ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయతీ రాజ్ కు చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించిందని, రుణాలు కింద తెచ్చిన రూ.4 వేల కోట్లు, బాండ్ల ద్వారా రూ.7000 కోట్లు ప్రభుత్వం సమీకరించిందన్నారు. ఈ నిధులన్నీ ప్రభుత్వం ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్య శ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు.

ప్రభుత్వ కుటిల యత్నాలను వెంటనే అరికట్టేందుకు సిఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా మీరు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. లబ్దిదారులకు మేలు చేసే డీబీపీ పథకాలకు నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలన్నారు. ఈ లేఖ కాపీని ఈసీ, సీఎస్, ఆర్థికశాఖ కార్యదర్శికీ పంపారు.