నాంపల్లిలో మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్

హైదరాబాద్‌ నగరవాసులకు ప్రధాన సమస్య ట్రాఫిక్‌. దాంతో పాటు పార్కింగ్ సమస్య కూడా చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ( ఎంఎల్‌పీ) కాంప్లెక్స్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని  హెచ్ ఎం ఆర్ ఎల్ ఎండీ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. 
 
ఆదివారం రోజున ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎంఎల్‌పీ పనులను ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టుని రూ. 80 కోట్లతో నిర్మించామని తెలిపారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు ఎండీ వివరించారు.

నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్‌కు సమీపంలో హెచ్‌యంఆర్‌కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తులుగా ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం, ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్ర్కీన్‌లతో కూడిన ఒక థియేటర్ కూడా ఉండనుంది. మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వందల చదరపు అడుగుల నిర్మిత ఏరియాలో 68 శాతం పార్కింగ్ కోసం, మిగిలిన 32 శాతం వాణిజ్య సదుపాయాలకు కేటాయిస్తున్నామని వివరించారు.

పార్కింగ్ స్థలంలో 250 కార్లు, 200 ద్విచక్రవాహనాలు నిలుపుదలజేసే అవకాశం ఉందని వివరించారు. పీపీపీ విధానంలో మెస్సర్స్ భారీ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ 50 సంవత్సరాల రాయితీ కాలంతో ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టింది. కరోనా తీవ్రత, డెట్ ఫైనాన్సింగ్ సమస్యలు, గ్లోబల్ సప్లయ్ చైన్ అంతరాయాలు తదితర కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యమైందని పేర్కొన్నారు. 
 
ఈ సమస్యలన్నింటినీ అధిగమించి నిర్మాణం పూర్తి చేశామని, అతి త్వరలో ఆధునిక పార్కింగ్ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రానుందని ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. కాంప్లెక్స్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు “లోపలకు/బయటకు ” టెర్మినల్స్, వాహనాల నిలుపుదల కోసం టర్న్ టేబుల్స్ ఏర్పాటు ఉంది. 
 
ఈ టేబుల్‌పై వాహనదారుడు తమ వాహనాన్ని వదిలి, తమ నిర్దేశిత పనులకు హాజరుకావచ్చు. యంఎల్‌పీ లోనికి వాహనం ప్రవేశించిన సమయంలో వాహనదారులకి స్మార్ట్ కార్డు జారీ అవుతుంది. తరచూ యంఎల్‌పీని వినియోగించేవారికి “ఆర్ ఎఫ్ ఐడి” కార్డులు జారీచేస్తారు. వాహనదారులకి ఏ టెర్మినల్ కేటాయించిందనేది ముందుగానే తెలియజేస్తారు.

వాహనం సైజ్ ఆధారంగా కంప్యూటరైజ్డ్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా వాహనాల వర్గీకరణ జరుగుతుంది. ఎస్ యు వి  లేదా సెడాన్ వాహనానికి తగినట్లుగా పార్కింగ్ బేలు కేటాయిస్తారు. ఆ తర్వాత ట్రాన్స్‌పోర్టర్ షటిల్ ఆ వాహనాన్ని లిఫ్ట్ ద్వారా నిర్ణీత అంతస్తులో కేటాయించిన స్థలంలో పార్క్ చేస్తుంది. ఈ మేరకు విశాలమైన, సౌకర్యవంతమైన టర్న్ టేబుల్సు ఏర్పాటు చేశామని ఎండీ తెలిపారు. 
 
ముంబై, ఢిల్లీలో ఉన్న యంఎల్‌పీ పార్కింగ్ వ్యవస్థలలో వాహనదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఆ పరిస్థితి ఇక్కడ ఉండదని వివరించారు.  పార్క్ చేసిన వాహనాన్ని తిరిగి పొందడానికి, డ్రైవర్ పార్కింగ్ రుసుము చెల్లించి, పార్కింగ్ టిక్కెట్‌ను కార్డ్ రీడర్‌కు చూపగానే, ట్రాన్స్ పోర్టర్-షటిల్ ఆటోమేటిక్‌గా కారును వాహనదారునికి అందజేస్తుంది. 
 
అదేవిధంగా.. డ్రైవర్ కారుని రివర్స్ తిప్పుకోవల్సిన అవసరం లేకుండా అందజేయడమౌతుంది. పార్కింగ్ కోసం కేవలం ఒక నిమిషం కంటే తక్కువ సమయం.. తిరిగి పొందడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుందని ఎన్వీయస్ రెడ్డి తెలిపారు.