ఓటుకు నోటు కేసులో రేవంత్ అరెస్ట్ ఖాయం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన  ఓటుకు నోటు కేసు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని, ఆయనను ఎవ్వరూ కాపాడలేరని  బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘనందనరావు స్పష్టం చేశారు. ఈ కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధముందని చెబుతూ ఈ కేసులో ఆయనకు శిక్షపడటం ఖాయమని తెలిపారు. 

2015లో ఓటుకి నోటు కేసు బయటకు వచ్చిందని గుర్తు చేస్తూ మరీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్‌‌రెడ్డిను కాపాడింది ఎవరు? అని ప్రశ్నించారు. కేసీఆర్‌, రేవంత్ కుటుంబాల మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయట్లేదని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని స్పష్టం చేసేటు బీజేపీకి డబుల్ డిజిట్ వస్తే తెలంగాణలో జరిగే పరిణామాలు ఏవిధంగా ఉంటాయో రేవంత్‌కి బాగా తెలుసునని ఎద్దేవా చేశారు

కాంగ్రెస్‌కి హామీలు ఇచ్చి మర్చిపోవడం అలవాటేనని చెబుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా హామీలు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన రోజునే తెలంగాణ ప్రాజెక్ట్ కు ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. ఒక్క రాష్ట్రంలో ప్రాజెక్ట్‌కి జాతీయ హోదా ఇచ్చి రెండో రాష్ట్రానికి ఇవ్వకపోవడం ఎంటి? అని ప్రశ్నించారు.

దుబ్బాకకు ఏమి చేశానో పుస్తకం తయారు చేసి.. నియోజకవర్గంలో 75వేల మందికి పంపిణీ చేస్తానని తెలిపారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందనరావు మెదక్‌లో పనికి వస్తారా ? అని హరీష్ రావు, రేవంత్ మాట్లాడుతున్నారని పేర్కొంటూ  కామారెడ్డిలో ఓడిపోయిన కేసీఆర్ రేపటి నుంచి బస్సు యాత్ర ఎలా చేపడతారు ? అని నిలదీశారు. 

2018లో కొడంగల్‌లో ఓడిన రేవంత్ మల్కాజగిరి నుంచి పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. రేవంత్ మీ కేబినెట్‌లో బీసీలు ఎంత మంది ఉన్నారు ? గెలిచిన ముదిరాజు బిడ్డకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. దుబ్బాక ఎంత దూరమో కొడంగల్ కూడా అంతే దూరమని.. అది సీఎం రేవంత్ మర్చిపోవద్దని హితవు చెప్పారు. 

 సిఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని రఘునందన్ కోరారు. మెన్న ఆదిలాబాద్ లో మోడీని పెద్దన్న అన్న రేవంత్ నేడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాధ్యంకాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు మర్చిపోవటం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని ఆయన పేర్కొన్నారు

. కేసీఆర్, రేవంత్ తెలంగాణకు హాని చేసే వ్యక్తులని ధ్వజమెత్తారు. వెంకట్రామిరెడ్డి దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ తనకంటే ఎక్కువ చదువుకున్నోడు కాదని, కేసీఆర్ గురించి మూడు ముక్కలో చెప్పాలంటే ఆర్భాటం, ఆరంభం, అంతమని విమర్శించారు.
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి తప్పు చేశారని.. ఆయన చేతిలోనే పార్టీ అంతమయ్యే అవకాశం ఉందని దెప్పిపొడిచారు. దిగ్విజయ్ సింగ్ చేసిన తప్పిదం వల్లే 10 ఏళ్లు బీఆర్ఎస్ బతికిందని గుర్తుచేశారు. భస్మాసుర హస్తం వలే ఆయన తలపై ఆయనే చేయి పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు 50 ఏళ్లు. ఇప్పుడు 70ఏళ్లు అని.. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంటుందని రఘునందన్‌రావు తెలిపారు.