హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించరాదని చంద్రబాబుకు `సుప్రీం’ ఆదేశం

ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్ట్‌ అయి మధ్యంతర బెయిల్‌పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్తయ్యేంతరకు సుప్రీం ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించ వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తు కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.

స్కిల్‌ కేసులో ఏపీ సీఐడీ గత ఆగస్టులో చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజుల పాటు జైలులో ఉంచింది. అయితే చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణలో ఉండగా కేసుపై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తూ మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది. 

సీఐడీ వాదనలను ఏపీ హైకోర్టు  పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ, ప్రభుత్వం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ను రద్దుచేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ మంగళవారం కేసు విచారణకు వచ్చింది. కోర్టులో కేసు విచారణలో ఉండగా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ సీఐడీ, అధికారుల పేర్లను రెడ్‌ డైరీలో నోట్‌ చేసుకుంటున్నామని, తాము అధికారంలోకి వచ్చాక అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని కోర్టులో సీఐడీ వాదనలు వినిపించింది. 

ఈ హెచ్చరికల ప్రభావం అధికారులపై పడే సూచనలున్నాయని, ఇది కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందని చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ తరుఫు న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని సూచిస్తూ కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.