ఏపీలో వైసిపి అనుకూల అధికారులను బదిలీ చేయండి

 
* డిజిపి, సీఎస్, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీలకై వినతి
 
ఆంధ్ర ప్రదేశ్ లో డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ లతో సహా అధికార పార్టీ వైసికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలని, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్డీయే పక్ష నేతలు భారత ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నేతృత్వంలో టిడిపి మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బిజెపి మాజీ ఎంపీ జివిఎల్ నరసింహారావు తదితరులు కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

ఎపిలోని సమస్యాత్మక పోలింగ్ బూత్‌లలో వీడి యో రికార్డింగ్ కు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.  కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం బిజెపి నేత అరుణ్ సింగ్ మాట్లాడుతూ, ఎపి డిజిపి, సిఎస్, ఇంటెలిజెన్స్ డిజిపి వైసీపీ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తున్నారని, వారు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నార న్న విషయాన్ని ఇసి దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ఇప్పటికే చంద్రబాబు అనేక ఫిర్యాదులు చేశారని అరుణ్ సింగ్ పేర్కొన్నారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, మూడు పార్టీల నేతలం మంగళవారం ఎన్నికల సంఘాన్ని కలిసి కొన్ని నివేదికలు అందించామని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో క్షీణిం చాయని, సాక్షాత్తు ముఖ్యమంత్రికే రక్షణ లేదన్న విషయాన్ని ఇసికి వివరించామని పేర్కొన్నారు. 

చంద్రబాబు, పవన్ కల్యాణ్ పైనా చాలా ప్రాంతాల్లో కావాలనే రాళ్ల దాడులు చేయిస్తున్నారన్న విషయాన్ని ఇసికి తెలియజేశామన్నారు. డిజిపి, ఇంటెలిజెన్స్ డిజిపి, సిఎస్‌ల పర్యవేక్షణ లోనే ఇన్ని సంఘటనలు జరుగుతుంటే, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నట్టు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా సిఎస్ తనకు అనుకూలమైన అధికారులకు పోస్టింగులు ఇచ్చిన వైనాన్ని, సిఇఒను కూడా తన వద్దకు పిలిపించుకుని సమీక్షలు చేస్తూ, ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఆయన వ్యవహ రిస్తున్న తీరును ఇసికి వివరించామని కనకమేడల తెలిపారు. డిజిపి పోలీసు బలగాన్నంతా తన నియంత్రణలో ఉంచుకుని, ప్రధాని హాజరైన సభకు కూడా సరైన బందోబస్తు కల్పించకుండా, ప్రోటోకాల్ చర్యలు తీసుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారన్న విషయాన్ని ఇసికి తెలియజేశామని పేర్కొన్నారు.

మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు

కాగా, ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాసుదేవరెడ్డిని తక్షణం విధుల నుంచి తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.  అలాగే ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. వాసుదేవరెడ్డి స్థానంలో మరొకరిని నియమించేందుకు ప్రత్యామ్నాయంగా ముగ్గురు ఐఏఎస్‌ల పేర్లతో జాబితా ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది. ఈ ప్రక్రియను మంగళవారం రాత్రి ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

టీడీపీ నేతల ఫిర్యాదుతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైసీపీ శ్రేణులు భారీగా మద్యాన్ని నిల్వ చేసుకుంటున్నాయని బేవరేజెస్ కార్పొరేషన్, అధికారులు ఇందుకు సహకరిస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.  ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలంటూ తన ఫిర్యాదులో అచ్చెన్న కోరారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వాసుదేవరెడ్డిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.