ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలో మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు తీసుకురావాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోను బిజెపి జరగనివ్వబోదని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం కర్ణాటకలోని బాగల్కోట్లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఎస్సి, ఎస్టి, ఓబిసి వర్గాలు ఇప్పుడు బిజెపి పక్షాన నిలవడంతో మైనారిటీలను బుజ్జగించడానికి కాంగ్రెస్ ఈ ప్రతిపాదన చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చి ఎస్సి, ఎస్టి, ఓబిల హుక్కులను కాలరాయడానికి కర్నాటకలో కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించిందని ధ్వజమెత్తారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అంగీకరించదని, అందుకనే ఓబిసి రిజర్వేషన్లలో కొంత భాగాన్ని ముస్లింలకు కర్నాటక ప్రభుత్వం ఇచ్చివేసిందని ఆయన విమర్శించారు. వారు ఇక్కడితో ఆగరని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి ఒక చట్టాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్ గతంలో కూడా మేనిఫెస్టోలో పేర్కొందని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ దురుద్దేశాలు అర్థం చేసుకోవలసిందిగా ఎస్సి, ఎస్టి, ఓబిసి సోదరులు, సోదరీమణులను కోరుతున్నట్లు ఆయన చెప్పారు. మత ప్రాతికన తమ ఓటు బ్యాంకును సురక్షితంగా ఉంచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కులను లూటీ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
ఎస్సి, ఎస్టి, ఓబిసి ఎంపీలలో అథ్యధికులు బిజెపి పార్టీకి చెందినవరేనని, ఈ కారణంగానే మైనారిటీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఎస్సి, ఎస్టి, ఓబిసిల నుంచి లూటీ చేసి మైనారిటీలకు ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ఆయన ఆరోపించారు. దీనికి మీరు అనుమతిస్తారా? అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. మీ హక్కులు, రిజర్వేషన్లను కాపాడేందుకు తాను ఎంత దూరమైనా వెళతానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు బిఎస్ ఎడియూరప్ప, బాగల్కోల్, విజయ్పురా ఎంపీలు పిసి గడ్డిగైడర్, రమేష్ జిగాజీనాగి కూడా పాల్గొన్నారు.
More Stories
మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం
ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు చెందేలా చేస్తాం
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు