ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మత ప్రాతిపాదక రిజర్వేషన్లు

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలో మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు తీసుకురావాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోను బిజెపి జరగనివ్వబోదని ఆయన స్పష్టం చేశారు. 

సోమవారం కర్ణాటకలోని  బాగల్‌కోట్లో ఒక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి వర్గాలు ఇప్పుడు బిజెపి పక్షాన నిలవడంతో మైనారిటీలను బుజ్జగించడానికి కాంగ్రెస్ ఈ ప్రతిపాదన చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చి ఎస్‌సి, ఎస్‌టి, ఓబిల హుక్కులను కాలరాయడానికి కర్నాటకలో కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించిందని ధ్వజమెత్తారు. 

 మత ప్రాతిపదికన రిజర్వేషన్లను మన రాజ్యాంగం అంగీకరించదని, అందుకనే ఓబిసి రిజర్వేషన్లలో కొంత భాగాన్ని ముస్లింలకు కర్నాటక ప్రభుత్వం ఇచ్చివేసిందని ఆయన విమర్శించారు.  వారు ఇక్కడితో ఆగరని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి ఒక చట్టాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్ గతంలో కూడా మేనిఫెస్టోలో పేర్కొందని ఆయన గుర్తు చేశారు. 

కాంగ్రెస్ దురుద్దేశాలు అర్థం చేసుకోవలసిందిగా ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి సోదరులు, సోదరీమణులను కోరుతున్నట్లు ఆయన చెప్పారు. మత ప్రాతికన తమ ఓటు బ్యాంకును సురక్షితంగా ఉంచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కులను లూటీ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి ఎంపీలలో అథ్యధికులు బిజెపి పార్టీకి చెందినవరేనని, ఈ కారణంగానే మైనారిటీల ఓట్లు కొల్లగొట్టేందుకు ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిల నుంచి లూటీ చేసి మైనారిటీలకు ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని ఆయన ఆరోపించారు. దీనికి మీరు అనుమతిస్తారా? అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. మీ హక్కులు, రిజర్వేషన్లను కాపాడేందుకు తాను ఎంత దూరమైనా వెళతానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు బిఎస్ ఎడియూరప్ప, బాగల్‌కోల్, విజయ్‌పురా ఎంపీలు పిసి గడ్డిగైడర్, రమేష్ జిగాజీనాగి కూడా పాల్గొన్నారు.

కాగా, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని పశ్చాత్తాప పడుతున్నారని ప్రధాని  మోదీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చిందని ఆరోపించారు. సిలికాన్ సిటీ బెంగళూరులో నీటి ఎద్దడి ఎక్కువ అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ప్రధాని ధ్వజమెత్తారు.

ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకాలం అయినా కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీ సమస్యను పరిష్కరించలేకపోయిందని ప్రధాని ఎద్దేవ చేశారు. సీఎం పదవి కోసం, అధికారం కోసం సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య ఇంకా పోరు నడుస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్‌ దివాలా కోరు విధానాలను అనుసరిస్తోందని చెబుతూ ఆ పార్టీది అర్బన్‌ నక్సల్‌ ఆలోచన ధోరణి అని ఆరోపించారు. సంపద పునఃపంపిణీ ప్రతిపాదన ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, వామపక్షాలు జట్టుకట్టి కేరళ రాష్ట్రాన్ని ఇప్పటికే దివాలా అంచులకు చేర్చాయని, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సైతం అదే పనిలో ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజల మధ్య విభజన రేఖ గీయడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని పేర్కొంటూ అయితే దేశభక్త ప్రజానీకం దీన్ని అంగీకరించబోదని ఆయన స్పష్టం చేశారు.