సివిల్స్ లో దోనూరి అన‌న్య రెడ్డికి మూడో ర్యాంక్

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ సివిల్స్ 2023 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. పాల‌మూరు అమ్మాయి దోనూరి అన‌న్య రెడ్డికి మూడో ర్యాంకు వ‌చ్చింది. ఆదిత్య శ్రీవాత్స‌వ‌కు తొలి ర్యాంకు రాగా, రెండో ర్యాంకు అనిమేష్ ప్ర‌దాన్, దోనూరి అన‌న్య రెడ్డికి మూడో ర్యాంకు వచ్చింది. నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, ఐదో ర్యాంకు రుహ‌నీకి వ‌చ్చింది.
 
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన దోనూరు అన‌న్య రెడ్డి తొలి ప్ర‌య‌త్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. ఆలిండియాలో థ‌ర్డ్ ర్యాంకు సాధించిన అన‌న్య‌కు అభినంద‌న‌లు వెలువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు రావడంపై అనన్య రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజులు 12-14 గంటలు చదివేదానినని ఆమె తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ అడ్డాకుల మండ‌లం పొన్న‌క‌ల్ గ్రామం మాది. ఢిల్లీ యూనివ‌ర్సిటీ అనుబంధ కాలేజీ మిరాండ హౌస్‌లో జియోగ్ర‌ఫీలో డిగ్రీ పూర్తి చేశాను. ఇక డిగ్రీ చ‌దువుతున్న స‌మ‌యంలోనే సివిల్స్ మీద దృష్టి సారించాను. దీంతో రోజుకు 12 నుంచి 14 గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివాను. ఆంథ్రోపాల‌జీ ఆప్ష‌న‌ల్ స‌బ్జెక్ట్‌గా ఎంచుకున్నాను. ఇందుకు హైద‌రాబాద్‌లోనే కోచింగ్ తీసుకుని ప‌క‌డ్బందీగా చ‌దివాను. అయితే ఈ ఫ‌లితాల్లో మూడో ర్యాంకు వ‌స్త‌ద‌ని ఊహించ‌లేదు అని అన‌న్య రెడ్డి తెలిపారు.

‘‘సమాజానికి సేవ చేయాలనేది నా చిన్ననాటి కల. అది సివిల్‌ సర్వీసెస్‌ ద్వారానే సాధ్యమని గట్టిగా నమ్మాను. అలా బలంగా నాలో నాటుకున్న కోరిక నెరవేరింది. మా ఇంట్లో సివిల్‌ సర్వీసె్‌సలో ఉన్నవారు ఎవరూ లేరు. అయినా లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసంతో అందుకున్నా. ఎంతో గర్వంగా ఉంది’’ అని తెలిపారు అనన్యరెడ్డి. 

ఇంటర్వ్యూ తర్వాత మంచి ర్యాంకు వస్తుందని భావించానని, మూడో స్థానంలో ఉంటానని అసలు ఊహించలేదని వివరించారు. కాగా, అనన్య గత సంవత్సరమే డిగ్రీ పూర్తి చేశారు. ఏడాది వ్యవధిలోనే సివిల్స్‌లో ప్రతిభ చూపారు. త‌మ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని తానేన‌ని చెప్పారు. నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కాగా అమ్మ గృహిణి అని పేర్కొన్నారు.

సివిల్స్ ఫలితాలలో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్ కు ఎంపికవటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరు అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ప్రతిభ చూపిన తెలంగాణ యువత

వందలోపు ర్యాంకుల్లో ముగ్గురు అభ్యర్థులు స్థానం సంపాదించి జయకేతనం ఎగరేశారు. తండ్రిని కోల్పోయి.. తల్లి బీడీలు చుడుతూ కష్టపడితే వచ్చిన డబ్బులతో చదువుకున్న కరీంనగర్‌ యువకుడు సాయికిరణ్‌ 27వ ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచారు. కటిక పేదరికంలో పెరిగి.. తల్లిదండ్రులు ఇచ్చిన కూలీ పైసలతో చదువుకుని.. 22 ఏళ్లకే ఐఏఎస్‌ కొలువు సాధించి.. వికారాబాద్‌ కుర్రాడు దయ్యాల తరుణ్‌ శభాష్‌ అనిపించారు. 

జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మెరుగు కౌశిక్‌ మొదటి ప్రయత్నంలోనే 82వ ర్యాంకు సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్స్‌లో (ఐఐఎ్‌ఫటీ)లో ఎంబీఏ పూర్తి చేశారు. ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నారు. సివిల్స్‌ ప్రిపరేషన్‌లో రోజుకు 12 గంటలకు పైగా చదివానని కౌశిక్‌ తెలిపారు. 

హనుమకొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ నగర్‌కు చెందిన రావుల జయసింహారెడ్డి 103వ ర్యాంకు సాధించారు. గత ఏడాది 217వ ర్యాంకు సాధించిన ఆయన ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం అల్వాలకు చెందిన పెంకీస్‌ ధీరజ్‌రెడ్డి 173వ ర్యాంకు సాధించారు. ఆయన 2015లో ఐఐటీ జేఈఈలో ఆల్‌ ఇండియా 64వ ర్యాంకు సాధించి ఐఐటీ ఢిల్లీలో చేరారు. సివిల్స్‌పై ఆసక్తితో కొద్ది నెలలకే బీటెక్‌ ఆపేశారు. ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ద్వారా 2015లో బీఏ కోర్సులో చేరారు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సన్నద్ధమవుతూ మూడుసార్లు యూపీఎస్సీ పరీక్ష రాశారు.

 ప్రస్తుతం ఐపీఎస్‌ లేదా వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏక్‌ ద ముఫాసిర్‌ 278వ ర్యాంకు సాధించారు. న్యూఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె టాపర్‌గా నిలిచారు. అనంతరం ఇంట్లోనే సివిల్స్‌కు సిద్ధయ్యారు. వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన సైంపు కిరణ్‌కుమార్‌ 568వ ర్యాంకు సాధించారు. గతంలో వచ్చిన ర్యాంకుతో ప్రస్తుతం ఇండియన్‌ పోస్టల్‌ సర్వీ్‌సలో విజయవాడ, విశాఖ నగరాల్లో పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.

సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ధి అఖిల్‌ 321వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదు. 2019లో ప్రిలిమ్స్‌లో.. 2020లో మెయిన్స్‌లో ఫెయిల్‌ అయ్యారు. 2021లో 566వ ర్యాంకు సాధించి.. ప్రస్తుతం ఢిల్లీలో ఏసీపీగా పనిచేస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన నిరుపేద అభ్యర్థి కొయ్యడ ప్రణయ్‌ 554వ ర్యాంకు సాధించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పాలిటెక్నిక్‌ వరకు చదివిన ఆయన.. కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో బీటెక్‌ ఎలకా్ట్రనిక్స్‌ చదివారు.

మెరిసిన తెలుగు తేజాలు

సివిల్స్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 23 మంది వెయ్యిలోపు ర్యాంకులు పొందారు. అక్షయ్‌ దీపక్‌ 196వ ర్యాంకు, లక్ష్మీ అన్నపూర్ణ(198), అనూష పిళ్లై(202), ఓంకార్‌(202), సయ్యద్‌ ముస్తాఫా హష్మీ(312), ఎన్‌.ప్రదీ్‌పరెడ్డి(382), నందిరాజు శ్రీమేఘన దేవ్‌(411), కృష్ణ శ్రీవాస్తవ్‌(444), బన్న వెంకటేశ్‌(467), హరి ప్రసాద్‌రాజ్‌(475), పూల ధనుష్‌(480), ఏ.మౌనిక(487), పృథ్వీరాజ్‌(493), కె.శ్రీనివాసులు(526), నెల్లూరు సాయితేజ(558), కిరణ్‌(568), నాగభరత్‌(580), భార్గవ్‌(590), కె.అర్పిత(639), సాక్షి కుమారి(679), రాజ్‌కుమార్‌ (703), గాదె శ్వేత(711), వి. ధనుంజయ్‌కుమార్‌(810), లక్ష్మీ బానోతు(828), ఆదా సందీప్‌ కుమార్‌(830), రాహుల్‌(873), హనిత వేముల పాటి(887), కె.శశికాంత్‌(891), కే.మీన(899), గోవద నవ్యశ్రీ 995వ ర్యాంకులు సాధించారు.