రిజర్వేషన్లు తీసేస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం

అన్ని కులాలకు సమాన రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మేము మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తామని అసత్య ప్రచారం చేస్తుందని బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇవన్నీ నమ్మకుండా రాబోయే ఎన్నికలలో బిజెపి పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. 

లోకసభ ఎన్నికలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్‌లో సోమవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్న జనాన్ని చూస్తుంటే మల్కాజిగిరి పార్లమెంట్ సీట్ బిజెపి పార్టీ గెలిచినట్లే కనపడుతుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత్ దేశ ప్రజలు సుఖ,సంతోషాలతో ఉన్నారని, ప్రపంచ దేశాలు అభద్రతా భావంలో ఉన్నాయని ఆయన తెలిపారు.  అసంఘటిత కార్మికులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా (ప్రతి సంవత్సరం), చిరు వ్యాపారులకు బ్యాంక్‌ల ద్వారా ముద్ర లోన్ ఇస్తున్నామని చెప్పారు. 

 మే నెల 13 వ తేదీన జరిగే మల్కాజిగిరి పార్లమెంటుకు జరిగే ఎన్నికలలో ఈటెల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మల్కాజ్‌గిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా హైదరాబాద్ లో ఎటువంటి మత ఘర్షనలు జరగలేదంటే అది ప్రధాన మంత్రి మోదీ  ఘనతేనని పేర్కొన్నారు.