కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ప్పటి నుంచి తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు మొదలవగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి ఎక్కువ మంది చేరిపోయారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికంటే ముందు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత ఇప్పుడు బీజేపీలో చేరడం ఆసక్తి కలిగిస్తున్నది. 
 
కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించగా నిరాశే ఎదురవటంతో వెంకటేశ్ నేత బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీలో చేరారు. దీంతో రెండు నెలల్లోనే రెండు కండువాలు మార్చి ఇప్పుడు మూడో కండువా కప్పుకున్నట్టయింది.
పెద్దపల్లి నుంచి వెంకటేశ్ నేత కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశించగా, ఆయనకు మొండి చేయి చూపించి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో వెంకటేష్ నేత బీజేపీలో చేరారు. 
 
కాగా.. బీజేపీ నుంచి కూడా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ఇప్పటికే ఆయన నామినేషన్ వేశారు కూడా. మరి ఈ సమయంలో బీజేపీలో చేరటం వెనుక వెంకటేశ్ నేత వ్యూహం ఏంటీ అన్నది తెలియాల్సి ఉంది.
 
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేష్ నేతకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ  సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, దేశరక్షణ, హిందూ ధర్మ రక్షణ కోసం మోదీ విశేష కృషి చేస్తున్నందున బీజేపీలో చేరానని తెలిపారు. మూడోసారి భారతదేశానికి మోదీ  ప్రధాని కావడం ఖాయమని, 400 పైగా స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుందని భరోసా వ్యక్తం చేసారు.
 
ఫిబ్రవరి 6వ తేదీనే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేష్ నేత ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బోర్లకుంట వెంకటేశ్‌ నేత 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు.  ఆ తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన వెంకటేశ్ నేత పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.