మూడు పార్టీల మేనిఫెస్టో విడుదల రేపే

“రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం” అనే నినాదంతో తెలుగుదేశం – జనసేన – బీజేపీ కూటమి తమ ఉమ్మడి మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేయనున్నాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసే ఈ మేనిఫెస్టో కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్​లతో పాటు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొంటారు.

పన్ను బాదుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంతో ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని.. సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామనే హామీని దీని ద్వారా కూటమి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం.

దీనికి సంబంధించి మూడు పార్టీల నేతలతో ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసింది. . వచ్చే 5 ఏళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్​తో దీనిని రూపొందించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి నేతలు చెబుతున్నారు. 

2023 రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికే మినీ మేనిఫెస్టో రూపంలో ప్రకటించిన తెలుగుదేశం, వాటిని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన సైతం పలు పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. 

మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగినందున, ఉమ్మడిగా పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించేందుకు బుధవారం ముహూర్తం ఖరారు చేసుకున్నాయి. మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. 

పథకాలకు నిధుల సమీకరణపై జగన్ మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. లబ్ధిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత అంశాలపై లోతైన కసరత్తు తరువాతనే తమ పథకాల ప్రకటన ఉంటుందని చెప్తున్నారు. తమ సూపర్ సిక్స్ ముందు ఇప్పటికే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో తేలిపోయిందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.