కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న సీఈసీ.. కేసీఆర్‌కు నోటీసులు జారీచేసింది. 
 
పార్టీ అధినేతగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని.. అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్.. నోటీసుల్లో పేర్కొన్నారు.
 
కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఎన్నికల ప్రదానాధికారి నుంచి, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వచ్చిన వివరణలతో కమిషన్ ఏకీభవిస్తున్నదని, కోడ్ ఉల్లంఘనలకు కేసీఆర్ పాల్పడిందనే నిర్ధారణకు వచ్చామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటికి తగిన సమాధానం ఇవ్వడానికి గడువు ఇస్తున్నామని, ఏప్రిల్ 18న ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌కు చేరేలా రిప్లై ఇవ్వాలని ఆ నోటీసులో అవినాశ్ కుమార్ స్పష్టం చేశారు.
 
 పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6న ఫిర్యాదు వచ్చిందని.. అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష పదజాలాన్ని ప్రస్తావించారన్నారు.
దీని మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ నెల 9న లేఖ రాశామని, ఆయన నుంచి 10వ తేదీన వివరణ వచ్చిందని అవినాశ్ కుమార్ ప్రస్తావించారు. దీనికితోడు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వచ్చిన రిప్లైలో కూడా కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని వాస్తవాలను ఉదహరించారని ఈ నోటీసులో పేర్కొన్నారు.