దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ

దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బిజెపి అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు చేస్తామని చెబుతూ  విపరీతమైన ఎండలో కూడా బిజెపి సభకు తరలవచ్చిన ప్రజలను చూసి నడ్డా ఆశ్చర్యపోయారు. కొత్తగూడెంలో సోమవారం జరిగిన బిజెపి బహిరంగ సభలో నడ్డా మాట్లాడుతూ కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేశామని, తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా మూడు రెట్లు పెరిగిందని తెలియజేశారు.
ఎంపి అభ్యర్థులు సీతారాం నాయక్, వినోద్ రావు గెలుపు ఖాయమని భరోసా వ్యక్తం చేశారు. అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను మోదీ  సాకారం చేశారని ప్రశంసించారు. మోదీ  ప్రభుత్వం ఎంతో దైర్యంతో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిందని నడ్డా కొనియాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను కూడా చూస్తున్నామని ధ్వజమెత్తారు. 

 మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సరికాదని నడ్డా స్పష్టం చేశారు. ఆయా పార్టీల వారసుల కోసమే ఇండియా కూటమి ఏర్పాటు చేశారని, ఇండియా కూటమి నేతలు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని, అనేక మంది కూటమి నేతలు అవినీతి చేసి జైళ్లకు వెళ్లారని దుయ్యబట్టారు.  బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కూతురు ఢిల్లీ మద్యం కేసు కుంభకోణంలో జైల్లో ఉన్నారని నడ్డా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంఘవ్యతిరేక శుక్తులన్నీ విజృంభిస్తాయని, కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి కనపడుతోందని నడ్డా విమర్శలు గుప్పించారు.

“గిరిజనుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ 11 వ స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకవచ్చారు. రెండేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోంది. మా పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు” అని నడ్డా తెలిపారు.  “మేడిన్ ఇండియా ఔషధాలు ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయి. ఒకప్పుడు ఫోన్లన్నీ మేడిన్ చైనా, కొరియా, జపాన్ అని ఉండేవి. మేకిన్ ఇండియా పేరుతో భారత్‌లోనే ఫోన్లు తయారవుతున్నాయి.  80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం, మరో ఐదేళ్లు కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు. 

“నాలుగు కోట్ల మందికి ఇళ్లు కటించి ఇచ్చాం, మరో మూడు కోట్ల ఇళ్లు కటిస్తాం. పిఎం మోదీ  ఎప్పుడూ పేదలు రైతుల గురించే ఆలోచన చేస్తారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికీ చికిత్స అందించాం, భవిష్యత్తులో పైపులైను ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తాం” అని జెపి నడ్డా తెలిపారు.