నేత్రపర్వంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం

శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. 
 
తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. తర్వాత కల్యాణ మూర్తులను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల మధ్య మిథిలా మైదానంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు.

రజత సింహాసనంపై సీతారామచంద్ర స్వాములను ఆసీనులను చేశారు. తిరువారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం నిర్వహించి మండప శుద్ధి చేశారు. ‘యుంజానహః ప్రథమం’ అనే మంత్రాని పఠిస్తూ వేద పండితులు ప్రజా సంపతర్థ్యం ‘శ్రీయం ఉద్వాః హిష్షే’ అన్న సంకల్పంతో స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చోబెట్టి కన్యావరణలు జరిపారు.

మోక్షబంధం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ గావించారు. వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించి ప్రవరలు వినిపించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పాదక స్నానం జరిపి వరపూజ కార్యక్రం జరిపారు. కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి ధరింపజేశారు.

అర్చక స్వాములు స్వామి వారికి నూతన వస్త్రాలను అలంకరించారు. అభిజిత్‌ లగ్నం సమయంలో సీతారాముల ఉత్సవమూర్తుల శిరసుపై జీలకర్రబెల్లం ఉంచి.. అనంతరం భక్తరామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కల్యాణ వేడుకలో వేలాది మంది భక్తులు వీక్షించి పరవశించి పోయారు. 

కల్యాణం జరిగిన మిథిలా మైదానంతో ఆలయ పరిసరాలన్నీ రామనామస్మరణతో మార్మోగాయి. కల్యాణోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ పీఎస్‌ నరసింహా, హైకోర్ట్ జడ్జి భీమపాక నగేష్రా రామయ్య కల్యాణాన్ని వీక్షించారు. కల్యాణ వేడుక సందర్భంగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. 

రామయ్య పెళ్లిని తిలకించడానికి వేలాదిగా భక్తుల తరలివచ్చారు. మిథిలా ఉదయం 10:30 గంటలకే కల్యాణ ఘట్టం ప్రారంభం కాగా… శ్రీరామ నామస్మరణతో భద్రాచలం వీధులు మార్మోగుతున్నాయి. కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు ప్రజాప్రతినిధులు వేడుకలో పాల్గొన్నారు. ఇక స్వామి వారి కల్యాణానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, కూలర్లు పెట్టించారు. భక్తుల కోసం 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు, లడ్డూ ప్రసాదాల పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేశారు. సీతారామచంద్ర స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం రేపు (ఏప్రిల్ 18) వైభవంగా నిర్వహించనున్నారు. సామూహిక పారాయణం, హోమాలతో పట్టాభిషేకం కత్రువు నిర్వహించనున్నారు.