కడియం కావ్య గుంటూరు కోడలు, వరంగల్ తో సంబంధమే లేదు

వరంగల్ నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా లోక్ సభకు పోటీచేస్తున్న మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య గుంటూరు చెందిన నజీరుద్దీన్ ను వివాహం చేసుకుందని, ఆమెకు వరంగల్ జిల్లాతో సంబంధమే లేదని  బిజేపీ వరంగల్ అభ్యర్థి  ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. హనుమకొండ లోని బీజేపీ ఆఫీస్ లో గురువారం పార్టీ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

గుంటూరు వ్యక్తులకు ఇక్కడ ఓట్లు ఎందుకు వెయ్యాలో చెప్పాలని రమేష్ డిమాండ్ చేశారు. గుంటూరు కోడలు కావాలో.. ప్రజల కష్టసుఖాల్లో తోడుంటే ఓరుగల్లు ముద్దుబిడ్డ కావాలో ప్రజలే ఆలోచించాలని ఆయన కోరారు. గడిచిన పదేళ్లలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో తోడున్నానని, అయినా తనను మూడోసారి గెలవకుండా పార్టీలోని కొందరు ద్రోహులే కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ముఖ్యంగా బీఆర్ఎస్ లో ఉంటూ డిప్యూటీ సీఎం లాంటి ఎన్నో పదవులు అనుభవించిన కడియం శ్రీహరి కుట్రలకు బలయ్యామని, మూడోసారి గెలిస్తే తన మంత్రి పదవికి అడ్డువస్తాననే ఉద్దేశంతో కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. టీడీపీ, టీఆర్ఎస్ లలో పదవులు పొంది, మాదిగలకు అన్యాయం చేశాడని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మాల, మాదిగలకు అందకుండా చేసిన మోసకారి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. 

తాటికొండ రాజయ్య, దయాకర్ తో పాటు తనను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపి చివరకు అదే పార్టీకి మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని ఆరోపించారు. దళితులను ఇబ్బంది పెట్టిన కడియంకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు. దేశ రక్షణ, ధర్మం, న్యాయం కోసం ప్రధాని మోదీ  పనిచేస్తున్నారని, ఆయన బృందంలో పనిచేయడానికి తామంతా వస్తున్నామని అరూరి రమేశ్ చెప్పుకొచ్చారు. 

ప్రపంచ దేశాలన్నీ మోదీ వైపే చూస్తున్నాయని, గ్రామాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి చేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, మామునూరు ఎయిర్ పోర్టు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు వేశామని చెప్పారు. మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు పట్టారని, దొంగలంతా పార్టీలో చేరి నాశనం చేశారని మహబూబాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ విమర్శించారు. బీఆర్ఎస్ లో కష్టపడి పనిచేస్ కేసీఆర్ పక్కన పెట్టారని, మూడు మూడు పదవులు తీసుకొని కేసీఆర్ పక్కన ఉన్నవాళ్లంతా కోట్లు కూడబెట్టారని ఆరోపించారు. 

కేసీఆర్ దుర్మార్గాలను చూసి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేశారని, అంతేతప్ప కాంగ్రెస్ చూసి మాత్రం ఓటు వేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరువు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. సుస్థిర, అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీ  నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెబుతూ తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని సీతారాం నాయక్ ధీమా వ్యక్తం చేశారు.