డీఎంకే ప్రమాదకర రాజకీయాలను బయటపెడుతూనే ఉంటా

తమిళనాడులోని అధికార డిఎంకె పార్టీ దశాబ్దాలుగా సాగిస్తున్న ప్రమాదకర రాజకీయాలను తాను బయటపెడుతూనే ఉంటానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మతం, కులం పేరిట ప్రజల మధ్య డిఎంకె ఘర్షణలను రాజేస్తోందని వేలూరులో ఒక ఎన్నికల సభనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని ఆరోపించారు. 

విభజించి పాలించు అనే డిఎంకె రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్న నాడు ఆ పార్టీకి రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా దక్కదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వెనుక డిఎంకె ఉందని ఆయన ఆరోపించారు. ఈ డ్రగ్ మాఫియాలకు ఎవరు రక్షణ కల్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్‌సిబి అరెస్టు చేసిన డ్రగ్ మాఫియా ఎవరి కుటుంబానికి చెందనదని ఆయన నిలదీశారు. 

అవినీతిపై డీఎంకే “కాపీరైట్” కలిగి ఉందని ఆరోపించిన ఆయన, గత రెండేళ్లలో అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా దాదాపు రూ. 4,600 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తమిళనాడు అంతటా ఎంత దోపిడీ చేస్తున్నారో ఒక్కసారి ఊహించుకోండని కోరారు.

 
డిఎంకె నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం “వంశపారంపర్య” రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. డీఎంకే ఆధ్వర్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా మూడు ప్రమాణాలను పాటించాలి: రాజకీయ రాజవంశానికి చెందినవారు, అవినీతి చరిత్ర కలిగిన వారు, తమిళ సాంస్కృతిక విలువలకు విరుద్ధంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని ఎద్దేవా చేశారు.

కచ్చతీవు అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, డిఎంకెపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ విషయమై అనేక ఏళ్లు ఆ రెండు పార్టీలు ప్రజలకు నిజాలు దాచాయని మోదీ  ఆరోపించారు. కచ్చతీవు ద్వీపం సమీపానికి వెళ్లిన భారత మత్సకారులను శ్రీలంక అరెస్టు చేయడంపై ఈ రెండు పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆయన విమర్శించారు. 

కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించేసిందని, ఈ నిర్ణయాన్ని ఏ క్యాబినెట్ తీసుకుందో, దీని వల్ల ఎవరు ప్రయోజనం పొందారో కాంగ్రెస్ పెదవి విప్పలేదని ఆయన ధ్వజమెత్తారు. గత కొన్నేళ్లలో అనేక మంది భారత మత్సకారులు అరెస్టయ్యాయని, దీనిపై కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తుంటారని ఆయన ఆరోపించారు. 

శ్రీలంకలో అరెస్టయిన భారత మత్సకారులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రంలోని తమ ప్రభుత్వం ఎన్నోసార్లు చొరవచూపిందని ఆయన తెలిపారు. ఈ మత్సకారులను వాపసు తీసుకురావడానికి కేంద్రంలోని ఎన్‌డిఎ నిరంతరం శ్రమిస్తోందని ఆయన చెప్పారు.

1974లో కచ్చతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా శ్రీలంకకు ధారాదత్తం చేసినట్లు తాజాగా బయటపడిందని మోదీ  చెప్పారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నపుడు భారత్, శ్రీలంక మధ్య 1974లో కుదిరిన ఒప్పందంపై తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై ఆర్‌టిఐ కింద అడిగిన ప్రశ్నకు వచ్చిన జవాబుతో అసలు వాస్తవాలు వెలుగుచూశాయని ఆయన చెప్పారు.