తెలంగాణాలో కాంగ్రెస్ లో చేరేందుకు బిజెపి ఎమ్యెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వాఖ్యల పట్ల బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యేను టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు.
బీజేపీ హైకమాండ్తో తెలంగాణ మంత్రులు టచ్లో ఉన్నారని మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా ఐదుగురు మంత్రులు సంప్రదింపులు జరిపారని వెల్లడించారు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి తాను షిండే పాత్ర పోషిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో సైతం కోమటిరెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదని చెబుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పట్టడం లేదని తెలిపారు.
చేరికలకు సంబంధించి బీజేపీ గేట్లు తీస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటలు కూడా ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఏక్నాథ్ షిండే పాత్ర పోషించడానికి చాలా మంది నేతలు ఉన్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను మహేశ్వర రెడ్డి ఖండించారు. కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి టచ్లో ఉన్నాడో లేడో తెలుసుకోవాలని కోరారు.
“అసలు మీ తమ్ముడు నీతో టచ్ లో ఉన్నాడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మీ తమ్ముడు నీతో టచ్ లేడంట. రాజగోపాల్ రెడ్డి భార్యకు ఎంపీ టికెట్ ఇస్తానని మోసం చేశారంట. అసలు ఆమెకు టికెట్ రాకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడ్డుకున్నారట. ముందు మీ పంచాయితీ చూసుకోండి” అంటూ హితవు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ చేత ఎందుకు విచారించడం లేదని మహేశ్వర రెడ్డి నిలదీశారు. రంజిత్ రెడ్డి భూములపై ఆరోపణలు చేసారని, తర్వాత పార్టీలో చేర్చుకుని పక్కన కూర్చొబెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ టెలిఫోన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వానిది అయినందున ఆ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే స్థాయి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేదని మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి ఎంపీ సీటును వెంకట్ రెడ్డి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. భువనగిరి ఎంపీ సీటును రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమవద్ద ఉందని చెబుతూ హైదరాబాద్ లో డబ్బులు వసూలు చేసి దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వాడుతుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆర్ టాక్స్ వసూల్ చేస్తున్నారని మహేశ్వర రెడ్డి ఆరోపించారు. ఆర్ అంటే రేవంత్, రాహుల్, రాజీవ్.. ఇందులో ఏ పేరుతో ట్యాక్స్ వసూల్ చేస్తున్నారో మాత్రం తెలియదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు రూ.1500 కోట్లు హైకమాండ్కు పంపించారని వివరించారు. మరో రూ.500 కోట్లు పంపించాల్సి ఉందని గుర్తు చేశారు.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి