కుప్పకూలిన స్టాక్ మార్కెట్… రూ. 13.5 లక్షల కోట్ల నష్టం

 
* అమెరికా ద్రవ్యోల్భణం గణాంకాల దుష్ప్రభావం
 
భారత స్టాక్ మార్కెట్ బుధవారం 1 శాతానికి పైగా క్షీణతను చవిచూసింది. ఫిబ్రవరిలో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలైన మరుసటి రోజే ఈ క్షీణత నమోదైంది. నిఫ్టీ 338 పాయింట్లు లేదా 1.51 శాతం నష్టంతో 21,997.70 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 906 పాయింట్ల నష్టంతో 72,761.89 వద్ద ముగిసింది.

మార్చి 13 న, ఎన్ఎస్ఈ లోని సుమారు 161 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. అందుబాటులో ఉన్న ఎన్ఎస్ఈ డేటా ప్రకారం 17 స్టాక్స్ మాత్రమే 52 వారాల గరిష్టాన్ని తాకాయి. ఈ రోజు మొత్తం 223 షేర్లు వార్షిక కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈలో కేవలం 89 షేర్లు మాత్రమే 52 వారాల గరిష్టాన్ని నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో సింధు ట్రేడ్, మార్షల్ మెషీన్స్, జీఆర్ఎం ఓవర్సీస్, సెల్లో వరల్డ్, బీజీఆర్ ఎనర్జీ వంటి షేర్లు గత 52 వారాల్లో కనిష్ట స్థాయిలను తాకాయి. సోమీ కన్వేయర్, ఇంటెలిజెన్స్ డిజైన్, మోడ్రన్ థ్రెడ్స్ (ఇండియా) లిమిటెడ్, డైమండ్ పవర్, డాల్ఫిన్ ఆఫ్ షోర్ షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి.

బీఎస్ఈలో ఇంట్రాడే ట్రేడింగ్ లో హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్, పేజ్ ఇండస్ట్రీస్, యూపీఎల్, జీ ఎంటర్టైన్మెంట్ వంటి 250కి పైగా షేర్లు 52 వారాల కనిష్టాన్ని తాకాయి. మరోవైపు టీసీఎస్, డెల్టా, ఎన్బీఎల్ షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. 

బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం దాదాపు రూ.385.6 లక్షల కోట్ల నుంచి రూ.372.1 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు మొత్తంగా రూ.13.5 లక్షల కోట్లు నష్టపోయారు. ఈ  మార్కెట్ పతనానికి గల కారణాలను మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అర్విందర్ సింగ్ నందా విశ్లేషించారు.

 “భారతదేశపు ప్రధాన బెంచ్ మార్క్ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ 1.5% కంటే ఎక్కువ క్షీణతను చవిచూశాయి. భారత స్టాక్ మార్కెట్లో తిరోగమనం ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు గణనీయంగా పడిపోవడం వల్ల జరిగింది’’ అని ఆయన వివరించారు. 

మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల అధిక విలువకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ ‘సెబీ’ లేవనెత్తిన ఆందోళనలకు ప్రతిస్పందనగా ఈ పతనం జరిగిందని, ఇది ఈ సెగ్మెంట్లలో కుదుపులకు దారితీసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.