రుతుపవనాల తర్వాతే ఆహార ధరలు తగ్గుముఖం

రుతుపవనాల సీజన్‌ తర్వాతే ఆహార వస్తువుల ధరలు తగ్గుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొన్నది. భారత వాతావరణశాఖ ఈ సారి సాధారణం కంటే ఎక్కువగా వర్షాపాతం ఉంటుందని అంచనా వేసిన విషయం తెలిసిందే.

వర్షాపాతం ఎక్కువ నమోదైతే పంటల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. వర్షాలతో దిగుబడులు అధికంగా వచ్చే అవకాశాలుంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నెలవారీగా సమీక్షలో పేర్కొంది. భారత్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 8.7శాతం ఉండగా, మార్చి నాటికి 8.5 శాతానికి తగ్గింది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూరగాయలు, పప్పుల ధరలు పెరగడం ప్రధాన కారణం.

అయితే, ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింగి. హోర్డింగ్స్‌ను నిరోధించడంతో పాటు స్టాక్‌ పరిమితులను నిర్ణయించడం, బఫర్‌ స్టాక్‌ను బలోపేతం చేస్తూ.. మార్కెట్‌కు విడుదల చేస్తూ వచ్చింది. అదే సమయంలో ఇతర దేశాలను నుంచి దిగుమతులను సైతం సులభతరం చేసింది. 

ధరలను కట్టి చేసేందుకు రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ద్వారా క్రమబద్ధీకరించింది. పప్పు దినుసులను దిగుమతి చేసుకునేందుకు దీర్ఘకాలిక ఒప్పందాల కోసం బ్రెజిల్, అర్జెంటీనా ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రెజిల్‌ నుంచి 20వేల టన్నులు పెసరపప్పు దిగుమతి కానున్నది. అర్జెంటీనా నుంచి కందుల దిగుమతి చర్చలు జరుపుతున్నది. ఈ చర్చలు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి.

అదే సమయంలో మొజాంబిక్, టాంజానియా, మయన్మార్‌ ప్రభుత్వాలతో పప్పుల దిగుమతికి ఒప్పందం కుదుర్చుకున్నది. ఇదిలా ఉండగా.. ఇటీవల క్రిసిల్‌ నివేదిక సైతం జూన్‌ తర్వాత కూరగాయలు తగ్గుతాయని పేర్కొంది. భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసిందని పేర్కొంది. 

జూన్ వరకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తుందని నివేదిక తెలిపింది. దాంతో కూరగాయల ధరలు రాబోయే కొద్ది రోజులు పెరగవచ్చని చెప్పింది. ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 30 శాతం నుంచి 28.3శాతానికి తగ్గింది. గతేడాదితో పోలిస్తే 8.4శాతం ఎక్కువగా. పెరుగుతున్న ధరలపై ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ గతంలో ఆందోళన వ్యక్తం చేసింది.