ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటా ఉపసంహరణ

ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2017 నుండి 2022 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటికి చాలా మూలధనాని అందించింది. దీంతో ఇప్పుడు ఈ బ్యాంకుల్లో ప్రధాన వాటా ప్రభుత్వం వద్ద ఉంది. 

డిజిన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల ఉపసంహరణ) ద్వారా ఈ బ్యాంకుల ఎన్‌పిఎ (నిరర్థక ఆస్తులు) తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, తద్వారా వాటి బ్యాలెన్స్‌షీట్‌లు మెరుగుపడతాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లలో ఉపసంహరణ ఉండనుంది. 

ఈ బ్యాంకుల్లో 75 శాతం దిగువన వాటాను ప్రభుత్వం కలిగి ఉంది. ఈ డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నియమానికి అనుగుణంగా ఉండేలా చూసుకోనుంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకారం, ఏ కంపెనీ అయినా లిస్టింగ్ అయిన 3 సంవత్సరాలలోపు కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25 శాతం నిర్వహించాలి. 

ఈ 5 బ్యాంకులకు ఎంపిఎస్ నియమాన్ని పాటించడానికి ఆగస్టు 2024 వరకు సమయం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఎంపిఎస్ నియమానికి అనుగుణంగా ఈక్విటీని విక్రయించడానికి సిద్ధం కావాలని ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటికీ తెలియజేసింది. ఈ బ్యాంకులు తమ మార్కెట్ విలువను పెంచుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది. 

ఎంపిఎస్ రాకపోవడం మార్కెట్‌కు తప్పుడు సందేశాన్ని పంపుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అందువల్ల ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేయదు. నాలుగు బ్యాంకుల్లో ప్రభుత్వం 90 శాతం వరకు వాటాను కల్గివుంది. ప్రస్తుతం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో పబ్లిక్ హోల్డింగ్ 98.25 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 96.38 శాతం, యూకో బ్యాంక్ 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 93.8 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 86.46 శాతం ప్రభుత్వం కలిగివుంది.