2025 చివరికల్లా ‘సముద్రయాన్’

‘చంద్రయాన్-3’ విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరింత దూకుడు పెంచింది. ఒక్కొక్కటిగా ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1  ప్రాజెక్ట్‌ని చేపట్టిన ఇస్ అంతరిక్షంలో మనుషులను పంపించేందుకు గాను గగన్‌యాన్ మిషన్‌కి సిద్ధమవుతోంది. 
 
ఇదే జోరులో సముద్రయాన్ ప్రాజెక్ట్‌ని చేపట్టేందుకు సిద్ధం అవుతుంది అవుతోంది. దీని లాంచింగ్‌కి కూడా దాదాపు ముహూర్తం ఖరారు చేసింది.  సముద్ర గర్భ అన్వేషణ కోసం భారతదేశం చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ ‘ సముద్రయాన్’ ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. 
 
ఇందులో భాగంగా ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టనుంచి ఆరువేల మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధనలు జరుపుతారని మంత్రి తెలిపారు.  ‘దీనికోసం ‘మత్స’ అనే జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సముద్ర జలాల్లో ఆరువేల మీటర్ల లోతుకు ప్రయాణిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయి. 2025 చివరికల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని రిజిజు చెప్పారు.
 
ఈ ప్రాజెక్ట్‌ని తాను సమీక్షించానని, ఈ ఏడాది చివరి నాటికి శాస్త్రవేత్తలు మొదటి ఉపరితల నీటి పరీక్షలను నిర్వహించగలరని పేర్కొన్నారు. సముద్ర జలాల్లో వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం కోసం 2021లో కేంద్ర ప్రభుత్వం ‘సముద్రయాన్ ’ప్రాజెక్టును ప్రకటించింది. మత్స జలాంతర్గామిని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో తయారు చేస్తున్నారు. ఇందులో ఆధునిక సెన్సర్లు, టూల్స్ ఉంటాయి. 
 
ఇది 12 గంటల కార్యాచరణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో దీనిని 96 గంటల వరకు పొడిగించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి ప్రాజెక్టులను అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, జపాన్‌ దేశాలు విజయవంతంగా చేపట్టాయి. సముద్రయాన్‌ను విజయవంతంగా చేపట్టడం ద్వారా భారత్ ఆ దేశాల సరసన చేరనుంది.