ఎన్నికల వేళ అయోధ్యలో మోదీ రామయ్య దర్శనం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో దూసుకెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటించారు. రామమందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాని మోదీ. జనవరిలో అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత బాలక్‌ రామ్‌ను మోదీ దర్శించుకోవడం ఇదే మొదటిసారి. 
 
అనంతరం స్థానికంగా నిర్వహించిన భారీ రోడ్‌షోలోనూ మోదీ పాల్గొన్నారు. సుగ్రీవ కోట నుంచి లతా చౌక్‌ వరకు రెండు కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్‌షో జరిగింది. మోదీ పర్యటన నేపథ్యంలో నగరమంతా ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కటౌట్‌లతో నిండిపోయింది. ఒకవైపు ఆదివారం కావడం, మరోవైపు ప్రధాని రాక నేపథ్యంలో అయోధ్యకు ప్రజలు భారీగా తరలివచ్చారు. 
 
దీంతో ఆలయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ లోక్ సభ స్థానానికి ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్‌ జరగనుంది.  అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీలు పాకులాడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌, స‌మాజ్‌వాదీ పార్టీలు త‌మ కోసం, త‌మ పిల్లల భ‌విష్యత్ కోస‌మే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాయ‌ని దుయ్యబట్టారు. 

మోదీ ఉన్నా, లేకున్నా దేశం ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. తాను దేశం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తీరు ప్రజ‌లు చూస్తున్నారని, నిజాయితీతో సేవ‌లందించ‌డమే త‌న ధ‌ర్మమ‌ని చెప్పారు. రాజకుటుంబ వారసుడే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావచ్చన్న ఆచారాన్ని ఈ టీ అమ్మేవాడు తుంగలో తొక్కాడని ప్రధాని ఉద్ఝాటించారు.“పదేళ్ల పదవీకాలం తర్వాత ఇంకోసారి మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. మీరందరూ నా కష్టాన్ని చూశారు. నిజాయితీతో మీరందరకీ సేవ చేయడమే నా ధర్మం. మోదీ భారత్ కోసం వచ్చే ఐదేళ్లు కాదు 25 ఏళ్ల కోసం బాటలు వేస్తున్నారు. మోదీ ఉన్నా లేకపోయినా దేశం ఎప్పటికీ ఉంటుంది” అని తెలిపారు. 

“ఎస్‌పీ, కాంగ్రెస్‌లు ఏం చేస్తున్నాయి? తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. మోదీ ఎవరి కోసం పనిచేస్తున్నారు? నేను ఏదీ వెనుక దాచుకోలేదు. యోగీ కూడా అలాగే ఉంటారు. మోదీ అలాగే ఉంటారు. యోగీ, మోదీ ఎవరి కోసం పనిచేస్తున్నారు. మాకు పిల్లలు లేరు. మీ పిల్లల కోసమే మేం పనిచేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు. రాజకుటుంబ వారసుడే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావచ్చన్న ఆచారాన్ని ఈ టీ అమ్మేవాడు తుంగలో తొక్కాడని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలైన ఎస్‌పి, కాంగ్రెస్ మిత్ర పక్షాలుగా ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలపై విమర్శనాస్త్రాలను మోదీ సంధిస్తూ, ‘ఆ ఆనువంశిక వ్యక్తుల వారసత్వ చరిత్ర ఏమిటి& కార్లు, బంగళాలు, రాజకీయ పలుకుబడి. కొందరు మైన్‌పురి, కన్నౌజ్, ఎటావాలను తమ జాగీర్లుగా పరిగణిస్తుంటారు, కొందరు అమేథి, రాయబరేలిలను తమ జాగీర్లుగా భావిస్తుంటారు’ అని ధ్వజమెత్తారు. 

‘మోదీ  సృష్టించిన వారసత్వ సంపద ప్రతి ఒక్కరి కోసం. 2047లో, మీ కుమారుడు, కుమార్తె కూడా ప్రధాని లేదా ముఖ్యమంత్రి కావాలని వాంఛిస్తున్నా. రాజకుటుంబాల వారసులు మాత్రమే పిఎం లేదా సిఎం కాగలరన్న దుష్ట సంప్రదాయాన్ని ఈ ‘చాయివాలా’ ఛేదించాడు’ అని ప్రధాని చెప్పారు.